నదినే డిక్లెర్క్ను ఔట్ చేసే అవకాశాలను చేజార్చడం తమ ఓటమిని శాసించిందని ముంబై ఇండియన్స్ కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ తెలిపింది. ఆఖరి ఓవర్ చివర్లో ఒక్క మంచి బంతి వేసినా ఫలితం తమకు అనుకూలంగా ఉండేదని అభిప్రాయపడింది. వుమెన్స్ ప్రీమియర్ లీగ్(డబ్ల్యూపీఎల్)లో ఇలాంటి ఫలితాలు సాధారణమేనని చెప్పుకొచ్చింది.
డబ్ల్యూపీఎల్ 2026 సీజన్లో భాగంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ)తో శుక్రవారం ఉత్కంఠగా సాగిన మ్యాచ్లో ముంబై ఇండియన్స్ 3 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. సునాయసంగా గెలవాల్సిన మ్యాచ్ను అనవసర తప్పిదాలతో చేజార్చుకుంది. ఆఖరి ఓవర్లో 18 పరుగులను డిఫెండ్ చేసుకోలేకపోయింది. ఈ మ్యాచ్ అనంతరం మాట్లాడిన హర్మన్ప్రీత్ కౌర్.. నదినే డిక్లెర్క్ తమ ఓటమిని శాసించిందని చెప్పింది. వీలైనంత త్వరగా ఈ ఓటమిని మరిచి తదుపరి మ్యాచ్కు సిద్దమవుతామని తెలిపింది.
'ఆఖరి ఓవర్లో ఎన్ని పరుగులు అవసరమైనా.. వాటిని సాధించగల సామర్థ్యం డిక్లెర్క్ ఉందనే విషయం మాకు తెలుసు. చివర్లో మేం ఒక్కటంటే ఒక్క మంచి బంతిని కూడా వేయలేకపోయాం. టీ20 క్రికెట్లో ఇలాంటివి జరగడం సాధారణమే. మేం ఆమెకు చాలా అవకాశాలు ఇచ్చాం. క్యాచ్లు నేలపాలు చేశాం. రనౌట్ అవకాశాన్ని చేజార్చుకున్నాం. కొన్నిసార్లు బ్యాటర్లు చాలా బలమైన మనస్తత్వంతో వస్తారు.
ఈ మ్యాచ్ గెలవడానికి మేం సాయశక్తులా ప్రయత్నించాం. కానీ వచ్చిన అవకాశాలను చేజార్చుకున్నాం. చివరి ఓవర్లో ఒక్క మంచి బంతి వేసినా మేం విజయం సాధించేవాళ్లం. డబ్ల్యూపీఎల్లో మాకు ఇలాంటి మ్యాచ్లు ఎదురవుతూనే ఉంటాయి. మేం ఈ ఓటమి గురించి ఆలోచిస్తూ ఉంటే.. తదుపరి మ్యాచ్ ఆడలేం. ఈ ఓటమిని మరిచి తర్వాతి మ్యాచ్లో ఇంకా మెరుగ్గా ఎలా రాణించాలో ఆలోచించాలి.

మా బ్యాటింగ్లో కూడా సరైన ఆరంభం లభించలేదు. తర్వాతి మ్యాచ్లో ఈ తప్పిదాలను సవరించుకోవడానికి ప్రయత్నిస్తాం. అందుకోసం అందరం కూర్చుని మా తప్పిదాలపై మాట్లాడుకుంటాం. ఈ పిచ్ బ్యాటింగ్కు అంత సులువుగా లేదు. కానీ మ్యాచ్ సాగే కొద్దీ బ్యాటింగ్కు అనుకూలించింది.'అని హర్మన్ప్రీత్ కౌర్ చెప్పుకొచ్చింది.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 154 పరుగులు చేసింది. నికోలా కేరీ(29 బంతుల్లో 4 ఫోర్లతో 40), సజీవన్ సజన(25 బంతుల్లో 7 ఫోర్లు, సిక్స్తో 45) టాప్ స్కోరర్లుగా నిలిచారు. ఆర్సీబీ బౌలర్లలో నదినే డీ క్లెర్క్(4/26) నాలుగు వికెట్లు తీయగా.. లారెన్ బెల్, శ్రేయాంక పాటిలో చెరో వికెట్ పడగొట్టారు.
అనంతరం ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 157 పరుగులే చేసి గెలుపొందింది. నదినే డీ క్లెర్క్ అజేయ హాఫ్ సెంచరీతో చెలరేగగా.. గ్రేస్ హ్యారీస్(12 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్తో 25) దూకుడుగా ఆడింది. ముంబై బౌలర్లలో నికోలా కారీ(2/35), అమెలియా కేర్(2/13) రెండేసి వికెట్లు తీయగా.. నాట్ సీవర్ బ్రంట్, షబ్నిమ్ ఇస్మాయిల్, అమన్జోత్ కౌర్ తలో వికెట్ తీసారు.