భారత మహిళల క్రికెట్ టీమ్ కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ చరిత్ర సృష్టించింది. మహిళల టీ20 ప్రపంచకప్ 2024లో భాగంగా న్యూజిలాండ్తో జరుగుతున్న తొలి మ్యాచ్తో అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. హర్మన్ప్రీత్ కౌర్కు కెప్టెన్గా ఇది నాలుగో టీ20 ప్రపంచకప్. ఈ క్రమంలోనే అత్యధిక టీ20 ప్రపంచకప్ ఎడిషన్స్లో టీమిండియాను నడిపించిన కెప్టెన్గా చరిత్రకెక్కింది.
హర్మన్ప్రీత్ కౌర్కు ముందు మిథాలీ రాజ్ మూడు ఎడిషన్లలో టీమిండియాను నడిపించగా.. జులన్ గోస్వామి రెండు ఎడిషన్స్లో టీమిండియాకు సారథం వహించింది. 2018, 2020, 2023, 2024 టీ20 ప్రపంచకప్ల్లో హర్మన్ప్రీత్ కౌర్ టీమిండియా కెప్టెన్గా వ్యవహరించగా.. 2012, 2014, 2016 ఎడిషన్స్లో మిథాలీ రాజ్, 2019, 2010లో జులన్ గోస్వామి టీమిండియా కెప్టెన్లుగా వ్యవహరించారు. అయితే ఇప్పటి వరకు భారత మహిళల జట్టు టీ20 ప్రపంచకప్ గెలవలేదు.

జులన్ గోస్వామి సారథ్యంలో రెండు సార్లు సెమీఫైనల్లో వెనుదిరిగింది. మిథాలీ రాజ్ సారథ్యంలో గ్రూప్ దశలోనే ఇంటిదారి పట్టింది. హర్మన్ ప్రీత్ కౌర్ సారథ్యంలో మెరుగైన ప్రదర్శన చేసిన భారత్ 2018, 2023లో సెమీఫైనల్లో వెనుదిరిగింది. 2020లో ఫైనల్ చేరి ఆస్ట్రేలియా చేతిలో ఓటమిపాలైంది. ఈ సారైనా టైటిల్ గెలవాలని హర్మన్సేన భావిస్తోంది.
ఇక అత్యధిక టీ20 ప్రపంచకప్లు ఆడిన తొలి భారత మహిళా ప్లేయర్గా హర్మన్ప్రీత్ కౌర్ రికార్డ్ సాధించింది. తాజా ఎడిషన్తో కలిపి ఆమె మొత్తం 9 ఎడిషన్స్ ఆడింది. ప్రపంచంలో ఆరుగురు ప్లేయర్లు మాత్రమే ఈ రికార్డు సాధించగా.. అందులో హర్మన్ప్రీత్ ఒకరు. 2009 నుంచి హర్మన్ప్రీత్ కౌర్తో పాటు సోఫీ డివైన్, సుజీ బేట్స్, ఎల్లిస్ పెర్రీ, స్టెఫైన్ టేలర్, చమరి ఆటపట్టు ప్రతీ ఎడిషన్ ఆడుతున్నారు.
అత్యధిక టీ20 మ్యాచ్లు ఆడటంతో పాటు సారథ్యం వహించిన ప్లేయర్గా హర్మన్ప్రీత్ కౌర్ చరిత్రకెక్కింది. ఇప్పటి వరకు 174 మ్యాచ్లు ఆడిన హర్మన్ప్రీత్ కౌర్.. 119 మ్యాచ్కు సారథ్యం వహించింది. న్యూజిలాండ్తో మ్యాచ్లో టీమిండియా టాస్ ఓడి ఫీల్డింగ్కు దిగింది. ఈ టోర్నీలో గ్రూప్-ఏలో ఉన్న టీమిండియా.. ఆదివారం పాకిస్థాన్తో.. అక్టోబర్ 9న శ్రీలంకతో, అక్టోబర్ 13న ఆస్ట్రేలియాతో తలపడనుంది.