మహిళల వన్డే ప్రపంచకప్ 2025 టోర్నీలో టీమిండియాకు మరో ఓటమి ఎదురైంది. డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియాతో ఆదివారం వైజాగ్ వేదికగా జరిగిన మ్యాచ్లో టీమిండియా 3 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. 331 పరుగుల భారీ లక్ష్యాన్ని టీమిండియా కాపాడుకోలేకపోయింది. అయితే లోయరార్డర్ బ్యాటింగ్ వైఫల్యమే తమ ఓటమిని శాసించిందని టీమిండియా కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ తెలిపింది.
మ్యాచ్ అనంతరం బ్రాడ్కాస్టర్తో మాట్లాడిన హర్మన్ప్రీత్ కౌర్.. తమ జట్టు అదనంగా 30-40 పరుగులు చేసి ఉంటే ఫలితం మరోలా ఉండేదని అభిప్రాయపడింది. 'ఈ రోజు మాకు దక్కిన ఆరంభం దృష్ట్యా మేం మరో 30-40 పరుగులు అదనంగా చేయాల్సింది. చివరి 6-7 ఓవర్లలో మేం వరుసగా వికెట్లు కోల్పోయాం. ఈ పిచ్ బ్యాటింగ్కు అనుకూలంగా ఉంది. కానీ మేం దాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయాం. గత కొన్ని మ్యాచ్లుగా మా ఓపెనర్లు అద్భుతంగా రాణిస్తున్నారు. అదిరిపోయే ఆరంభాలను ఇస్తున్నారు. అందుకే మేం భారీ లక్ష్యాలను నమోదు చేయగలుగుతున్నాం.

ఈ మ్యాచ్లోనూ మేం అద్భుతంగానే బ్యాటింగ్ చేశాం. కానీ చివరి 5 ఓవర్లు మాకు తీవ్ర నష్టం కలిగించాయి. గత మూడు మ్యాచ్ల్లో మేం మిడిల్ ఓవర్లలో సరిగ్గా బ్యాటింగ్ చేయలేదు. కానీ లోయరార్డర్ బాధ్యత తీసుకొని జట్టును గట్టెక్కించింది. కానీ ఈ రోజు మాత్రం 40 ఓవర్ల వరకు మా బ్యాటింగ్ బాగుంది. కానీ చివరి 10 ఓవర్లలో మేం ఆశించిన రీతిలో రాణించలేకపోయాం. ఆటలో ఇవన్నీ సహజమే. ఎల్లప్పుడూ 100 శాతం రాణించలేం. కానీ ఎలా పుంజుకున్నారు అనేది ముఖ్యం. తదుపరి రెండు మ్యాచ్లు మాకు చాలా ముఖ్యమైనవి. ఈ మ్యాచ్లో ఓడినా మాకు చాలా సానుకూల అంశాలు ఉన్నాయి.
తెలుగు అమ్మాయి శ్రీ చరణి అద్భుతంగా ఆడుతోంది. జట్టుకు అవసరమైనప్పుడల్లా వికెట్లు తీస్తోంది. ఈ రోజు కూడా ఆమె అద్భుతంగా బౌలింగ్ చేసింది. ఆస్ట్రేలియా బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టింది. ముఖ్యంగా అలీసా హీలీని కూడా కట్టడి చేసింది. అంత సునాయసంగా పరుగులు ఇవ్వలేదు. ఆమె ప్రదర్శనపై మాకు చాలా ఆశలు ఉన్నాయి. ఆమె జట్టుకు కావాల్సిన బ్రేక్ త్రూ అందివ్వగలదు.
మా టీమ్ కాంబినేషన్ గురించి మేం చర్చిస్తాం. ఎందుకంటే గతంలో ఈ కాంబినేషన్తోనే మేం విజయాలు సాధించాం. రెండు పరాజయాలతోనే ఈ కాంబినేషన్ సరి కాదని నేను అనుకోవడం లేదు. ముందు ముందు చాలా విషయాలపై ఫోకస్ పెట్టాలి. తదుపరి మ్యాచ్ల్లో అత్యుత్తమ ప్రదర్శన కనబరుస్తామని ఆశిస్తున్నా.'అని హర్మన్ప్రీత్ కౌర్ చెప్పుకొచ్చింది.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా 48.5 ఓవర్లలో 330 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఓపెనర్లు స్మృతి మంధాన(66 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్స్లతో 80) ప్రతికా రావల్(96 బంతుల్లో 10 ఫోర్లు, సిక్స్తో 75) విధ్వంసకర బ్యాటింగ్తో చెలరేగగా.. హర్లీన్ డియోల్(42 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్తో 38), రిచా ఘోష్(22 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్లతో 32), జెమీమా రోడ్రిగ్స్(21 బంతుల్లో 5 ఫోర్లతో 33) పర్వాలేదనిపించారు.
ఆస్ట్రేలియా బౌలర్లలో అన్నబెల్ సదర్లాండ్(5/40) ఐదు వికెట్లతో టీమిండియా పతనాన్ని శాసించింది. సోఫీ మోలినక్స్(3/75) మూడు వికెట్లు తీయగా.. మేఘన స్కట్, అష్లే గార్డ్నర్ చెరో వికెట్ పడగొట్టారు. అనంతరం ఆస్ట్రేలియా 49 ఓవర్లలో 7 వికెట్లకు 331 పరుగులు చేసి సునాయస విజయాన్నందుకుంది. కెప్టెన్ అలీసా హీలీ(107 బంతుల్లో 21 ఫోర్లు, 3 సిక్స్లతో 142) భారీ శతకంతో చెలరేగగా.. ఫోబీ లిచిఫీల్డ్(40), ఎల్లీస్ పెర్రీ(47 నాటౌట్), అష్లే గార్డ్నర్(46 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్తో 45) కీలక ఇన్నింగ్స్ ఆడారు.
భారత బౌలర్లలో తెలుగు తేజం శ్రీచరణి(3/41) మూడు వికెట్లతో సత్తా చాటగా.. అమన్జోత్ కౌర్(2/75), దీప్తి శర్మ(2/52) రెండేసి వికెట్లు పడగొట్టారు. క్రాంతి గౌడ్(0/73), స్నేహ్ రాణా(0/85) ధారళంగా పరుగులిచ్చుకున్నారు. ఈ ఇద్దరి వైఫల్యం టీమిండియా విజయవకాశాలను దెబ్బతీసింది.