IND-W vs ENG-W, one-off Test: భారత మహిళా క్రికెట్ జట్టు చరిత్ర సృష్టించింది. మహిళల టెస్ట్ క్రికెట్లో 88 ఏళ్ల తర్వాత తొలి రోజే 400 ప్లస్ రన్స్ చేసిన తొలి జట్టుగా నిలిచింది. ఇంగ్లండ్ మహిళలతో ముంబై వేదికగా జరుగుతున్న ఏకైక టెస్ట్లో ముందుగా బ్యాటింగ్ చేస్తున్న టీమిండియా తొలి రోజు ఆట ముగిసే సమయానికి 94 ఓవర్లలో 7 వికెట్లకు 410 పరుగులు చేసింది.
దాంతో మహిళల టెస్ట్ క్రికెట్లో తొలి రోజు అత్యధిక స్కోర్ చేసిన రెండో జట్టుగా భారత్ రికార్డుకెక్కింది. ఈ జాబితాలో ఇంగ్లండ్ తొలి స్థానంలో ఉంది. 1935లో న్యూజిలాండ్తో జరిగిన టెస్ట్లో ఇంగ్లండ్ తొలి రోజు 4 వికెట్లకు 431 పరుగులు చేసింది. అప్పటి నుంచి మరే జట్టు కూడా ఈ రికార్డు అందుకోలేదు. 88 ఏళ్ల తర్వాత టీమిండియా ఈ ఫీట్ సాధించింది.

ఈ మ్యాచ్లో టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన టీమిండియాకు శుభారంభం దక్కలేదు. ఓపెనర్లు స్మృతి మంధాన(17), షెఫాలీ వర్మ(19) తీవ్రంగా నిరాశపరిచారు. అరంగేట్ర ప్లేయర్ సతీష్ శుభా(76 బంతుల్లో 13 ఫోర్లతో 69) తో పాటు జెమీమా రోడ్రిగ్స్(99 బంతుల్లో 11 ఫోర్లతో 68), యస్తికా భాటియా(88 బంతుల్లో 10 ఫోర్లు, సిక్స్తో 66), దీప్తి శర్మ(95 బంతుల్లో 9 ఫోర్లు, సిక్స్తో 60 బ్యాటింగ్) హాఫ్ సెంచరీలతో రాణించడంతో టీమిండియా భారీ స్కోర్ నమోదు చేసింది.

కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్(49) తృటిలో హాఫ్ సెంచరీ చేజార్చుకుంది. సతీష్ శుభా, జెమీమా అసాధారణ బ్యాటింగ్తో మూడో వికెట్కు 115 పరుగులు జోడించారు. యస్తికా భాటియా, హర్మన్ ప్రీత్ కౌర్ ఐదో వికెట్కు 116 పరుగులు జోడించగా.. స్నేహ్ రాణా(30)తో కలిసి దీప్తి శర్మ ఏడో వికెట్కు 92 పరుగుల భాగస్వామ్యాన్ని అందించింది.

క్రీజులో దీప్తి శర్మతో పాటు పూజ వస్త్రాకర్(12 బంతుల్లో 4 నాటౌట్) ఉంది. ఇంగ్లండ్ బౌలర్లలో లారెన్ బెల్ రెండు వికెట్లు తీయగా.. నాట్ సీవర్, చార్లీ డీన్, సోఫీ ఎక్లెస్టోన్ తలో వికెట్ తీసారు.