మహిళల వన్డే ప్రపంచకప్ 2025లో విజేతగా నిలిచిన భారత జట్టుతో ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. బుధవారం స్వయంగా తన ఇంటికి ఆహ్వానించి విశ్వ విజేతగా నిలిచిన అమ్మాయిలను అభినందించారు. ఈ సందర్భంగా ఆటగాళ్లతో కలిసి ఆయన సరదాగా ముచ్చటించారు.
ప్రధానితో ప్లేయర్లంతా ఒక్కొక్కరిగా మాట్లాడారు. ఈ సందర్భంగా టీమిండియా బ్యూటీఫుల్ బ్యాటర్ హర్లీన్ డియోల్ అడిగిన ప్రశ్న నవ్వులూ పూయించింది. ప్రధాని మోదీనే 'మీ స్కిన్ కేర్ రహస్యం ఏంటి'అని ప్రశ్నించి అమ్మాయి బుద్దిని చాటుకుంది. ఈ ప్రశ్నతో మోదీతో సహా అందరూ నవ్వారు. హర్మన్ప్రీత్తో కలిసి మోదీ తన సంభాషణను ప్రారంభించారు. ఫైనల్ బంతిని జేబులో వేసుకోవడం గురించి ఆరా తీసారు. అదృష్టవశాత్తూ బంతి తన దగ్గరకు వచ్చిందని, తన వద్దే పెట్టుకున్నానని హర్మన్ బదులిచ్చింది.

ఆ తర్వాత 2021లో ఇంగ్లండ్పై హర్లీన్ డియోల్ అందుకున్న క్యాచ్ను మోదీ గుర్తు చేశారు. మైక్ అందుకున్న హర్లీన్ డియోల్.. ' సర్, మీ స్కిన్ ఎప్పుడూ మెరుస్తూ ఉంటుంది. మీ స్కిన్ కేర్ రహస్యమేంటో చెప్పండి?'అని నవ్వుతూ అడిగింది. దాంతో అంతా నవ్వారు. మోదీ కూడా చిరునవ్వుతో వాటి గురించి తాను పట్టించుకోనని బదులిచ్చారు. వెంటనే మరో ప్లేయర్.. దేశంలోని కోట్లాది మంది ప్రేమ వల్లే మీ చర్మం మెరుస్తుందని కొనియాడింది. ఈ సంభాషణలో జోక్యం చేసుకున్న హెడ్ కోచ్ అమోల్ ముజుందార్.. 'చూశారా సర్.. ఇలాంటివారిని నేను డీల్ చేయాల్సి వచ్చింది. అందుకే నా జట్టు త్వరగా తెల్లబడిపోయింది.'అని పేర్కొన్నారు.
భారత స్టార్ ఆల్రౌండర్, ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ దీప్తి శర్మ వేయించుకున్న హనుమాన్ టాటూ గురించి ప్రధాని మోదీ ప్రశ్నించారు. 'హనుమంతుడి టాటూ ఉంది.. అది ఎలా సాయపడింది'అని అడిగారు. తనకు హనుమంతుడంటే చాలా ఇష్టమని, ఆయనను తాను ఎక్కువగా నమ్ముతానని దీప్తి శర్మ బదులిచ్చింది. తన ఆట మెరుగవ్వడానికి ఈ టాటూ ఉపయోగపడిందని తెలిపింది. అంతేకాకుండా ప్రధానిగా మీరు ఇచ్చే ప్రసంగాలను తరుచూ వింటుంటానని, చాలా కఠినమైన పరిస్థితలను చాలా ప్రశాంతంగా హ్యాండిల్ చేస్తారని మోదీని కొనియాడింది. తాను కూడా ఆ లక్షణాన్ని అలవర్చుకున్నానని తెలిపింది. భారత మహిళల జట్టు ఈ రోజు రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలవనుంది.