యుద్ద విమానాలను కూల్చామని భారత్ అభిమానులను ఎగతాళి చేసిన పాకిస్థాన్ పేసర్ హారిస్ రౌఫ్పై అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) కఠిన చర్యలు తీసుకుంది. ఈ ఘటనను తీవ్ర నేరంగా పరిగణించిన ఐసీసీ.. మ్యాచ్ ఫీజులో కోత విధించడంతో పాటు రెండు మ్యాచ్లు ఆడకుండా నిషేధం విధించింది.
ఆసియా కప్ 2025 టోర్నీ సందర్భంగా సెప్టెంబర్ 14న జరిగిన మ్యాచ్లో హారిస్ రౌఫ్ భారత అభిమానులను రెచ్చగొట్టాడు. బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ చేసే సమయంలో ఆరు యుద్ద విమానాలను కూల్చామని సైగలు చేశాడు. సెప్టెంబర్ 28న జరిగిన ఫైనల్లోనూ రౌఫ్ మరోసారి ఇలాంటి ప్రవర్తనను పునరావృతం చేశాడు. దాంతో ఈ రెండు మ్యాచ్ల మ్యాచ్ ఫీజులో 30 శాతం కోత విధించిన ఐసీసీ.. రెండేసి చొప్పున మొత్తం నాలుగు డీ మెరిట్ పాయింట్లు కేటాయించింది. ఐసీసీ రూల్స్ ప్రకారం ఓ ఆటగాడు 24 నెలల వ్యవధిలో నాలుగు డీమెరిట్ పాయింట్స్ పొందితే రెండు మ్యాచ్లు ఆడకుండా నిషేధానికి గురవుతాడు. దీంతో రౌఫ్.. సౌతాఫ్రికాతో తొలి రెండు వన్డేలకు దూరమయ్యాడు.

మరోవైపు తమ విజయాన్ని భారత సాయుధ బలగాలకు అంకితం చేసిన టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్పై కూడా ఐసీసీ చర్యలు తీసుకుంది. మ్యాచ్ ఫీజులో 30 శాతం కోత విధించడంతో పాటు రెండు డీమెరిట్ పాయింట్స్ కేటాయించింది. మరో 24 నెలల వ్యవధిలో సూర్య ఖాతాలో మరో రెండు డీమెరిట్ పాయింట్స్ చేరితే అతను కూడా రెండు మ్యాచ్ల నిషేధం ఎదుర్కొవాల్సి ఉంటుంది.
హాఫ్ సెంచరీ అనంతరం తుపాకీ ఎక్కిపెట్టినట్లుగా సంబరాలు చేసుకున్న పాకిస్థాన్ ఓపెనర్ ఫర్హాన్తో పాటు హారిస్ రౌఫ్ను క్లీన్ బౌల్డ్ చేసి విమానం కూలిందా? అంటూ సైగలు చేసిన బుమ్రాపై కూడా ఐసీసీ చర్యలు తీసుకుంది. ఈ ఇద్దరికి చెరో డీమెరిట్ పాయింట్ కేటాయించింది. ఆసియా కప్ 2025 టోర్నీలో టీమిండియా విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. అయితే పీసీబీ ఛైర్మన్ మోహ్సిన్ నఖ్వీ.. ఏసీసీ ఛైర్మన్గా టైటిల్ ప్రదానం చేసేందుకు సిద్దం కాగా.. భారత్ నిరాకరించింది. మోహ్సిన్ నఖ్వీ చేతుల మీదుగా టైటిల్ స్వీకరించలేమని మొండికేసింది. దాంతో మోహ్సిన్ నఖ్వీ టైటిల్ను తన వెంట తీసుకెళ్లాడు. ఇప్పటి వరకు టైటిల్ తిరిగివ్వలేదు. పహల్గామ్ ఉగ్రదాడికి నిరసనగా భారత్.. ఆపరేషన్ సిందూర్ చేపట్టిన సంగతి తెలిసిందే.