ఐపీఎల్ 2024 సీజన్ నేపథ్యంలో ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ మార్పు నిర్ణయంపై టీమిండియా మాజీ పేసర్ శ్రీశాంత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇది అనవసర రాద్దాంతమని, హార్దిక్ పాండ్యా కెప్టెన్సీలో ఆడేందుకు రోహిత్ శర్మకు ఉన్న సమస్య ఏంటని ప్రశ్నించాడు. క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కరే.. ధోనీ సారథ్యంలో ఆడాడని, 2011 వన్డే ప్రపంచకప్ కూడా గెలిచాడని గుర్తు చేశాడు.
ఐపీఎల్ 2024 సీజన్ కోసం ముంబై ఇండియన్స్.. గుజరాత్ టైటాన్స్ కెప్టెన్గా ఉన్న హార్దిక్ పాండ్యాను క్యాష్ ట్రేడ్ డీల్ ద్వారా జట్టులోకి తెచ్చుకొంది. ఆ వెంటనే అతన్ని తమ సారథిగా ప్రకటించింది. టీమ్ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయం తీసుకున్నామని ముంబై ఇండియన్స్ మేనేజ్మెంట్ వివరణ ఇచ్చింది.

అయితే ఐదు టైటిళ్లు అందించిన రోహిత్ శర్మను కాదని హార్దిక్ పాండ్యాకు సారథ్య బాధ్యతలు ఇవ్వడాన్ని ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోతున్నారు. ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీపై దుమ్మెత్తిపోస్తున్నారు. మ్యాచ్ల సందర్భంగా హార్దిక్ పాండ్యాను గేలి చేస్తూ.. దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. మరోవైపు రోహిత్ శర్మ సైతం ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ నిర్ణయంపై అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది.
వచ్చే ఏడాది అతను ముంబై ఇండియన్స్కు గుడ్బై చెప్పి మరో జట్టులోకి వెళ్లే అవకాశం ఉందని, జట్టు రెండుగా చీలిపోయిందనే పుకార్లు షికారు చేస్తున్నాయి. వీటిపై స్పందించిన ఇషాంత్ శర్మ ఘాటుగా బదులిచ్చాడు.
'క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్.. మహేంద్ర సింగ్ ధోనీ సారథ్యంలో ఆడటం మనమంతా చూశాం. మేం ప్రపంచకప్ కూడా గెలిచాం. హార్దిక్ పాండ్యా సారథ్యంలో రోహిత్ శర్మ ఆడాల్సి రావడంపై చాలా కథనాలు వెలువడుతున్నాయి. అయితే ఇవేవి పట్టించుకోకుండా రోహిత్ శర్మ స్వేచ్చగా ఆడుతున్నాడు.
'నాకు తెలిసినంతవరకు రోహిత్ ఎలాంటి కెప్టెన్సీ భారం లేకుండా స్వేచ్ఛగా బ్యాటింగ్ చేయాలని చూస్తాడు. ఆరెంజ్ క్యాప్ కూడా అందుకోవచ్చు. అతనికి ఇది గొప్ప సీజన్గా నిలవనుంది. ఇన్నాళ్లు అతను ముంబై ఇండియన్స్ను ముందు ఉండి నడిపించాడు. ఇప్పుడు వెనుకాల ఉండి నడిపిస్తున్నాడు. ఈ విషయంలో నాకు ఎలాంటి సందేహం లేదు.
రోహిత్ ఏ ఫ్రాంచైజీకి ఆడినా 100 శాతం తన ఎఫర్ట్ పెడుతాడు. ఈ సీజన్లో అతను భారీ స్కోర్ చేసే అవకాశం ఉంది.'అని శ్రీశాంత్ చెప్పుకొచ్చాడు.