భారత క్రికెట్లో భారీ మార్పులు చోటు చేసుకునే అవకాశాలు కల్పిస్తున్నాయి. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ అంతర్జాతీయ టెస్ట్లకు వీడ్కోలు పలుకుతాడనే ప్రచారం జోరుగా సాగుతోంది. పేలవ ఫామ్తో సతమతమవుతున్న ఈ ఇద్దరు స్టార్ ఆటగాళ్లు గౌరవంగా తప్పుకోవాలనే అభిమానులు సూచిస్తున్నారు.
ఆస్ట్రేలియాతో సిడ్నీ వేదికగా శుక్రవారం ప్రారంభమైన ఐదో టెస్ట్కు కెప్టెన్ రోహిత్ శర్మ దూరంగా ఉన్నాడు. జట్టు ప్రయోజనాల కోసం స్వచ్ఛందంగా తప్పుకున్నాడని, తాత్కలిక సారథి జస్ప్రీత్ బుమ్రా తెలిపాడు. అయితే వన్డే క్రికెట్కు కూడా రోహిత్ శర్మ దూరమవుతాడనే ప్రచారం తెరపైకి వచ్చింది. వన్డే సారథ్య బాధ్యతల నుంచి రోహిత్ శర్మను తప్పించి హార్దిక్ పాండ్యాను నూతన సారథిగా నియమించేందుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) నిర్ణయించినట్లు వార్తలు వస్తున్నాయి.

వన్డే కెప్టెన్గా హార్దిక్ పాండ్యా..
ఇంగ్లండ్తో వన్డే సిరీస్కు హార్దిక్ పాండ్యాను కెప్టెన్గా ఎంపిక చేసి.. ఆ తర్వాత పూర్తి స్థాయి సారథిగా కొనసాగిస్తారనే వాదన వినిపిస్తోంది.
అదే జరిగితే ఫిబ్రవరిలో జరిగే ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా రోహిత్ శర్మకు బదులు హార్దిక్ పాండ్యా సారథ్యంలో ఆడాల్సి ఉంటుంది. అప్పుడు రోహిత్ జట్టులో ఆటగాడిగా కొనసాగుతాడా? లేదా అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలుకుతాడా?అనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది.
టీ20 ప్రపంచకప్ 2024 విజయానంతరం రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ అంతర్జాతీయ టీ20లకు వీడ్కోలు పలికారు. ఒకవేళ బీసీసీఐ వన్డే కెప్టెన్సీ మార్పు నిర్ణయాన్ని ప్రకటిస్తే రోహిత్ అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికే ఛాన్స్ ఉంది.
కోహ్లీ సైతం..
మరోవైపు కోహ్లీ కేవలం బ్యాటర్గానే జట్టులో కొనసాగుతున్నాడు. ఆసీస్ పర్యటనలో అతను దారుణంగా విఫలమయ్యాడు. ఛాంపియన్స్ ట్రోఫీ 2025 అనంతరం అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించాలనే ఆలోచనలో విరాట్ కోహ్లీ ఉన్నట్లు సన్నిహిత వర్గాలు పేర్కొన్నాయి. ఫామ్లో లేకపోతే ఎవరినైనా ఊపేక్షించేది లేదని హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఇప్పటికే స్పష్టం చేశాడు.
ఫార్మాట్కో కెప్టెన్..
టీమిండియా వన్డే కెప్టెన్గా హార్దిక్ పాండ్యాను బీసీసీఐ నియమిస్తే.. టీమిండియాకు ఫార్మాట్కో కెప్టెన్ ఉంటాడు. టీ20ల్లో టీమిండియాను సూర్యకుమార్ యాదవ్ నడిపిస్తున్నాడు. అతని సారథ్యంలోని టీమిండియా అసాధారణ ప్రదర్శన కనబరుస్తోంది. టెస్ట్ల్లో తాత్కలిక సారథిగా జస్ప్రీత్ బుమ్రా కొనసాగుతున్నాడు. రోహిత్ శర్మ తప్పుకుంటే అతనే పూర్తి స్థాయి కెప్టెన్గా మారనున్నాడు. భారత క్రికెట్లో గతంలో ఎప్పుడూ ఇలా ఫార్మాట్కో కెప్టెన్ లేడు. పరిమిత ఓవర్ల ఫార్మాట్కు ఒకరు.. టెస్ట్ల్లో మరొకరు కొనసాగిన సందర్భాలు మాత్రమే ఉన్నాయి.