భయ్యా ఈ అవార్డు నీదే..
మ్యాచ్ అనంతరం తాను అందుకున్న అవార్డును నట్టూకి ఇచ్చేసి ‘ఇది నీదే భయ్యా.. నువ్వే అర్హుడివి'అని చెబుతూ ఫొటోకు ఫోజిచ్చాడు. అంతటితో ఆగకుండా ట్విటర్ వేదికగా అభిమానులతో పంచుకున్నాడు. ‘నటరాజన్.. ఈ సిరీస్లో నీ ఆట అసాధారణం. క్లిష్ట స్థితిలో నీ బౌలింగ్ అద్భుతం. అరంగేట్ర సీజన్లోనే ఇంతలా ఆకట్టుకున్నావంటే నీ కష్టం, నైపుణ్యం ఎంటో తెలుస్తుంది. ఈ మ్యాన్ ఆఫ్ ద సిరీస్ అవార్డుకు నువ్వే అర్హుడివి భాయ్. సిరీస్ గెలిచిన భారత్కు అభినందనలు'అని క్యాప్షన్గా పేర్కొన్నాడు. ఇక కెప్టెన్ విరాట్ కోహ్లీ కూడా ట్రోఫీ అందుకున్న వెంటనే దాన్ని నట్టూకి ఇచ్చాడు. ఈ సిరీస్ నీదే బ్రో అన్నట్లు ఫోజిచ్చాడు.

పాండ్యాకు ఎలా ఇస్తారు?
ఇక నటరాజన్కు మ్యాన్ ఆఫ్ ద సిరీస్ ఇవ్వకుండా పాండ్యాకు ఇవ్వడంపై నెటిజన్లు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. కేవలం రెండు మ్యాచ్ల్లో మాత్రమే ఆడిన పాండ్యాకు అలా ఎలా ఇస్తారని, మూడు మ్యాచ్ల్లో బెస్ట్ ఎకానమీతో బౌలింగ్ చేసిన నట్టూకు ఇవ్వాలని ట్విటర్ వేదికగా డిమాండ్ చేస్తున్నారు. ఇక పాండ్యా కూడా దీన్ని అంగీకరించడాన్ని ప్రశంసిస్తున్నారు. పాండ్యాది నిజాయితని, గొప్ప మనుసని కొనియాడుతున్నారు.

మరో బుమ్రాలా..
ఆస్ట్రేలియాతో మూడు వన్డేల సిరీస్లో ఆఖరి మ్యాచ్లో అవకాశం దక్కించుకున్న ఈ సన్రైజర్స్ హైదరాబాద్ పేసర్.. అరంగేట్రంలోనే అదరగొట్టాడు. తన ఫస్ట్ ఇంటర్నేషనల్ మ్యాచ్లో రెండు వికెట్లు తీసి 2-0తో సిరీస్ కోల్పోయిన జట్టుకు ఉపశమన విజయాన్నందించాడు. ఈ సూపర్ ఫెర్ఫామెన్స్తో టీ20ల్లోకి కూడా అరంగేట్రం చేసి మరో బుమ్రాలా చెలరేగాడు. తొలి టీ20లో 4 ఓవర్లలో 30 పరుగులు మాత్రమే ఇచ్చి మూడు కీలక వికెట్లు తీసిన నట్టూ.. ఆదివారం జరిగిన రెండో టీ20లో భారత బౌలర్లంతా విఫలమైన వేళ పొదుపైన బౌలింగ్తో ప్రత్యర్థిని కట్టడి చేశాడు. నాలుగు ఓవర్లలో కేవలం 20 పరుగులే ఇచ్చి రెండు కీలక వికెట్లు తీశాడు. ఆఖరి టీ20లోనూ నట్టూ ఆకట్టుకున్నాడు. జోరు మీదున్న గ్లేన్ మ్యాక్స్వెల్ను ఔట్ చేసి భారీ స్కోర్కు అడ్డుకట్ట వేశాడు. మాథ్యూ వేడ్ను ఔట్ చేసినప్పటికీ అంపైర్ల తప్పిదంతో ఖాతాలోకి రాలేదు.

యార్కర్ల నట్టూ..
ఐపీఎల్ 2020 సీజన్లో నటరాజన్ అద్భుత ప్రదర్శన కనబర్చాడు. 8.02 ఎకానమీతో 16 వికెట్లు తీశాడు. ఈ ప్రదర్శనే టీమిండియాకు ఎంపికయ్యేలా చేసింది. మరే ఇతర బౌలర్ సాధ్యం కానీ విధంగా ఈ సీజన్లో నటరాజన్ సుమారు 65 యార్కర్లు వేసాడు. దాంతోనే తన పేరును యార్కర్ల నట్టూగా మార్చుకున్నాడు. ఇక ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగిన క్వాలిఫయర్ 2లో కూడా చివరి ఓవర్లలో అద్భుతంగా యార్కర్లు వేసి ప్రత్యర్థి భారీ స్కోర్ చేయకుండా కట్టడి చేశాడు. నట్టూ బౌలింగ్కు యువరాజ్ సింగ్, హర్షాబోగ్లే సైతం ఫిదా అయ్యారు. ఇంతగా రాణించిన అతనికి భారత జట్టులోకి నేరుగా అవకాశం దక్కలేదు. ఫస్ట్ నెట్ బౌలర్గా.. ఆ తర్వాత స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి గాయపడటంతో టీ20లకు.. సైనీ గాయంతో వన్డేలో బ్యాకప్గా అవకాశం దక్కించుకున్నాడు. అరంగేట్ర మ్యాచ్లోనే వికెట్లు తీసి.. టీ20 అరంగేట్రాన్ని కూడా ఖాయం చేసుకున్నాడు.


Click it and Unblock the Notifications
