తన ప్రియురాలు మహికా శర్మ వల్లే సౌతాఫ్రికాతో తొలి టీ20లో మ్యాచ్ విన్నింగ్ ప్రదర్శన కనబర్చానని టీమిండియా స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా తెలిపాడు. ఐదు టీ20ల సిరీస్లో భాగంగా మంగళవారం కటక్ వేదికగా జరిగిన తొలి మ్యాచ్లో భారత్ 101 పరుగుల భారీ తేడాతో సౌతాఫ్రికాను చిత్తు చేసింది.
176 పరుగుల లక్ష్య ఛేదనలో సౌతాఫ్రికా 74 పరుగులకే కుప్పకూలి ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. ఈ మ్యాచ్లో హార్దిక్ పాండ్యా(28 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్స్లతో 59 నాటౌట్) అజేయ హాఫ్ సెంచరీతో రాణించాడు. బౌలింగ్లోనూ ఒక వికెట్ తీసి భారత విజయంలో కీలక పాత్ర పోషించాడు. టాపార్డర్, మిడిలార్డర్ విఫలమైన వేళ అద్భుత బ్యాటింగ్తో జట్టుకు భారీ స్కోర్ అందించాడు. ఈ ప్రదర్శనతో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్ అందుకున్నాడు.
ఈ మ్యాచ్ అనంతరం మీడియా సమావేశంలో పాల్గొన్న హార్దిక్ పాండ్యా.. సానుకూల దృక్పథమే తనను తిరిగి మైదానంలో అడుగు పెట్టేలా చేసిందని తెలిపాడు. 'గాయం తర్వాత నేను మరింత దృఢంగా తిరిగి వచ్చాను. గాయాలు మనల్ని మానసికంగా పరీక్షిస్తాయి. బలంగా నిలబడటం వల్లే నాలో మరింత ఆత్మవిశ్వాసం పెరిగింది. నా మీద నాకు చాలా నమ్మకం ఉంది. నిజానికి మనల్ని మనం కచ్చితంగా నమ్మాలి.

మనమీద మనకే విశ్వాసం లేనప్పుడు ఇతరులు మనల్ని ఎలా నమ్ముతారు. మైదానంలో దిగిన ప్రతీ క్షణాన్ని, ఆటను ఆస్వాదించాలనుకున్నా. జనాలను ఆకట్టుకునేలా ఆడాలనుకోవడమే నాకు అసలైన ప్రేరణ. అలాగే నేను రాణించడానికి నా ప్రియురాలు కూడా ఓ కారణం. ఆమె నా జీవితంలోకి వచ్చిన తర్వాత చాలా మంచి జరిగింది.'అని హార్దిక్ పాండ్యా తన ప్రియురాలు మహికా శర్మ గురించి చెప్పుకొచ్చాడు.
ముంబైలో కొందరు ఫొటోగ్రాఫర్లు మహికా శర్మను అసభ్యంగా ఫొటోలు తీయడంపై హార్దిక్ పాండ్యా ఆగ్రహం వ్యక్తం చేశాడు. మహిళలకు కనీస గౌరవం ఇవ్వాలని , ప్రతీ ఒక్కరికీ హద్దులుంటాయని సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నాడు. మహికా శర్మ లోదుస్తులు కనిపించేలా ఫొటోలు, వీడియోలు తీయగా.. అవి నెట్టింట వైరల్గా మారాయి.