బాలీవుడ్ ఫొటోగ్రాఫర్లపై టీమిండియా స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా ఆగ్రహం వ్యక్తం చేశాడు. తన ప్రియురాలు మహికా శర్మను ఫొటోలు, వీడియోలు తీసే క్రమంలో హద్దులు దాటిన పపరాజీలపై మండిపడ్డాడు. మహికా శర్మ.. ఓ రెస్టారెంట్ మెట్లు దిగి వస్తుండగా పపరాజీలు తమ కెమెరాలను క్లిక్మనిపించారు. అసభ్యంగా ఫొటోలు, వీడియోలు తీయగా నెట్టింట వైరల్ అయ్యాయి. ఈ ఫొటోలు, వీడియోలపై సోషల్ మీడియా వేదికగా మండిపడిన హార్దిక్ పాండ్యా.. చీప్ సెన్సేషనలిజమ్ కోసం ఇలా దిగజరాడం సరికాదన్నాడు. మహిళలను గౌరవించాలని హితవు పలికాడు. ఇకపై ఫొటోలు తీసేటప్పుడు మైండ్ఫుల్గా ప్రవర్తించాలన్నాడు.
'సెలెబ్రిటీగా జీవించడం అంటే అందరి చూపు, పరిశీలన ఉంటాయి అని నాకు తెలుసు. ఇది నా జీవితంలో భాగమే. కానీ ఈ రోజు హద్దులు దాటిన సంఘటన ఒకటి చోటు చేసుకుంది. మహికా శర్మ.. బాంద్రా రెస్టారెంట్ మెట్లపై నుంచి నడుస్తూ వస్తుండగా.. ఏ స్త్రీని తీయని కోణంలో ఫొటోలను క్యాప్చర్ చేసే ప్రయత్నం పపరాజీలు చేశారు. ఒక వ్యక్తిగత క్షణాన్ని చీప్ సెన్సేషనలిజమ్గా మార్చారు.

హెడ్లైన్స్, క్లిక్ల కోసం ఇంతలా దిగజారడం సరికాదు. స్త్రీలను గౌరవించడం ప్రాథమిక నియమం. ప్రతీ ఒక్కరు హద్దులు కలిగి ఉండాలి. ప్రతీ రోజు ఎంతో కష్టపడే మీడియా సోదురులంటే నాకు ఎంతో గౌరవం. వారికి నేను ఎల్లప్పుడూ సహకరిస్తాను. కానీ ఇలాంటి విషయాల పట్ల కాస్త ఎక్కువ శ్రద్ద వహించాలని కోరుతున్నా.
ప్రతీది క్యాప్చర్ చేయాల్సిన అవసరం లేదు. ప్రతీ కోణాన్ని తీసుకోవాల్సిన అవసరం అంతకంటే లేదు. కాస్త మానవత్వంతో వ్యవహరిద్దాం. ధన్యవాదాలు.'అని హార్దిక్ పాండ్యా ఇన్స్టా స్టోరీలో సుదీర్ఘ పోస్ట్ పంచుకున్నాడు. నటాషా స్టాంకోవిచ్తో విడాకుల అనంతరం పలువురు సెలెబ్రిటీలతో డేటింగ్ చేసిన హార్దిక్ పాండ్యా.. మహికా శర్మతో ప్రేమలో ఉన్నట్లు ఇటీవల ప్రకటించాడు. ప్రస్తుతం ఈ ఇద్దరూ తమ డేటింగ్ లైఫ్ను ఆస్వాదిస్తున్నారు.