టీమిండియా స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా కోసం హైదరాబాద్ అభిమానులు ఎగబడ్డారు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో భాగంగా పంజాబ్తో మంగళవారం హైదరాబాద్లోని ఉప్పల్ స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్లో హార్దిక్ పాండ్యా బరోడా తరఫున బరిలోకి దిగాడు. సౌతాఫ్రికాతో టీ20 సిరీస్కు సన్నాహకంగా సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ ఆడుతున్న హార్దిక్ పాండ్యా తన తొలి మ్యాచ్లో విధ్వంసకర బ్యాటింగ్తో చెలరేగాడు. 42 బంతుల్లో 7 ఫోర్లు, 4 సిక్స్లతో 77 పరుగులతో అజేయంగా నిలిచి తన పునరాగమనాన్ని ఘనంగా చాటుకున్నాడు.
ఈ మ్యాచ్కు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్సీఏ) ఫ్రీ ఎంట్రీ కల్పించడంతో ఫ్యాన్స్ భారీ సంఖ్యలో హాజరయ్యారు. బరోడా తరఫున హార్దిక్ పాండ్యా, కృనాల్ పాండ్యా బరిలోకి దిగగా.. పంజాబ్ తరఫున విధ్వంసకర ఓపెనర్ అభిషేక్ శర్మ బరిలోకి దిగాడు. ఈ స్టార్ ఆటగాళ్లను చూసేందుకు హైదరాబాద్ ఫ్యాన్స్ భారీ సంఖ్యలో తరలివచ్చారు.

అభిమానులు భారీ సంఖ్యలో హాజరవ్వడాన్ని ఊహించలేకపోయిన హెచ్సీఏ అందుకు తగ్గట్లు భద్రతా ఏర్పాట్లు చేయలేకపోయింది. తక్కువ సంఖ్యలోనే భద్రతా సిబ్బంది ఉండటంతో అభిమానులు పలు మార్లు మైదానంలోకి పరుగెత్తారు. తమ అభిమాన ఆటగాళ్లను కలుసుకునేందుకు సెక్యూరిటీ కళ్లు గప్పి మైదానంలోకి పరుగుతీసారు.
కొందరు అభిమానులు మైదానంలోకి పరుగెత్తి హార్దిక్ పాండ్యా కాళ్లు మొక్కడంతో పాటు అతనితో కలిసి సెల్ఫీలు దిగారు. అతను ఫీల్డింగ్ చేస్తుండగా.. బ్యాటింగ్ చేసేటప్పుడు ఫ్యాన్స్ మైదానంలోకి దూసుకొచ్చారు. హార్దిక్ పాండ్యా సైతం అభిమానులను వారించకుండా సెల్ఫీలు దిగాడు. వారిని కొట్టవద్దని సెక్యూరిటీకి సూచించాడు. ఈ కారణంగా మ్యాచ్కు పలుమార్లు అంతరాయం కలిగింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్గా మారాయి.
హార్దిక్ విధ్వంసంతో ఈ మ్యాచ్లో బరోడా 5 బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని ఛేదించింది. ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 222 పరుగులు చేసింది. అభిషేక్ శర్మ(19 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్స్లతో 50), అన్మోల్ప్రీత్ సింగ్(32 బంతుల్లో 7 ఫోర్లు, 4 సిక్స్లతో 69) హాఫ్ సెంచరీలతో సత్తా చాటారు. బరోడా బౌలర్లలో హార్దిక్ పాండ్యా, రసిక్ సలామ్, అతిత్ షేత్ తలో వికెట్ తీయగా.. రాజ్ లింబానీ(3/36) మూడు వికెట్లు పడగొట్టారు.
అనంతరం బరోడా 19.1 ఓవర్లలో 3 వికెట్లకు 224 పరుగులు చేసి గెలుపొందింది. హార్దిక్ పాండ్యా(42 బంతుల్లో 7 ఫోర్లు, 4 సిక్స్లతో 77 నాటౌట్), శివాలిక్ శర్మ(31 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్తో 47 నాటౌట్) పరుగులతో రాణించాడు. అశ్వని కుమార్, రమణ్దీప్ సింగ్ తలో వికెట్ తీసారు.