టీమిండియా స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా దుమ్మురేపాడు. సౌతాఫ్రికాతో టీ20 సిరీస్కు సన్నాహకంగా సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ ఆడుతున్న హార్దిక్ పాండ్యా తన తొలి మ్యాచ్లో విధ్వంసకర బ్యాటింగ్తో చెలరేగాడు. 42 బంతుల్లో 7 ఫోర్లు, 4 సిక్స్లతో 77 పరుగులతో అజేయంగా నిలిచి తన పునరాగమనాన్ని ఘనంగా చాటుకున్నాడు.
ఆసియా కప్ 2025 సందర్భంగా గాయపడ్డ హార్దిక్ పాండ్యా.. ఆ తర్వాత ఆస్ట్రేలియా పర్యటనతో పాటు సౌతాఫ్రికాతో వన్డే సిరీస్కు దూరమయ్యాడు. గాయం నుంచి కోలుకున్న అతను మ్యాచ్ ఫిట్నెస్ కోసం సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో బరోడా తరఫున బరిలోకి దిగాడు. పంజాబ్తో మంగళవారం హైదరాబాద్లోని ఉప్పల్ స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్లో విధ్వంసకర హాఫ్ సెంచరీతో బరోడా విజయంలో కీలక పాత్ర పోషించాడు. హార్దిక్ విధ్వంసంతో ఈ మ్యాచ్లో బరోడా 5 బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని ఛేదించింది.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 222 పరుగులు చేసింది. అభిషేక్ శర్మ(19 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్స్లతో 50), అన్మోల్ప్రీత్ సింగ్(32 బంతుల్లో 7 ఫోర్లు, 4 సిక్స్లతో 69) హాఫ్ సెంచరీలతో సత్తా చాటారు. బరోడా బౌలర్లలో హార్దిక్ పాండ్యా, రసిక్ సలామ్, అతిత్ షేత్ తలో వికెట్ తీయగా.. రాజ్ లింబానీ(3/36) మూడు వికెట్లు పడగొట్టారు.

అనంతరం బరోడా 19.1 ఓవర్లలో 3 వికెట్లకు 224 పరుగులు చేసి గెలుపొందింది. హార్దిక్ పాండ్యా(42 బంతుల్లో 7 ఫోర్లు, 4 సిక్స్లతో 77 నాటౌట్), శివాలిక్ శర్మ(31 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్తో 47 నాటౌట్) పరుగులతో రాణించాడు. అశ్వని కుమార్, రమణ్దీప్ సింగ్ తలో వికెట్ తీసారు.
తాజా ఇన్నింగ్స్లో హార్దిక్ పాండ్యా రీఎంట్రీకి మార్గం సుగుమమైంది. డిసెంబర్ 9 నుంచి సౌతాఫ్రికాతో ఐదు టీ20ల సిరీస్ ప్రారంభం కానుంది. డిసెంబర్ 9న కటక్ వేదికగా, డిసెంబర్ 11న న్యూ చంఢీఘర్లో రెండో టీ20, డిసెంబర్ 14న ధర్మశాల వేదికగా మూడో టీ20, డిసెంబర్ 17న లక్నో వేదికగా నాలుగో టీ20, డిసెంబర్ 19న అహ్మదాబాద్ వేదికగా ఐదో టీ20 జరగనుంది. ఈ సిరీస్కు భారత సెలెక్టర్లు ఇంకా జట్టును ప్రకటించలేదు.