టీమిండియా స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా తన మాజీ సతీమణి నటాసా స్టాంకోవిచ్, కుమారుడు అగస్త్యలకు ఖరీదైన లగ్జరీ కారును బహుమతిగా ఇచ్చాడు. నటాషాకు విడాకులు ఇచ్చి ఆమెకు దూరమైన తర్వాత కూడా తన కొడుకు కోసం హార్దిక్ పాండ్యా.. ఆమెతో సన్నిహితంగానే ఉంటున్నాడు. విడాకుల సమయంలోనే ఈ జోడీ ఇదే విషయాన్ని స్పష్టం చేసింది. భార్యాభర్తలుగా విడిపోయినా.. అగస్త్య తల్లిదండ్రులుగా అతనికి ఎలాంటి లోటు రాకుండా చూసుకుంటామని పేర్కొంది.
ఈ క్రమంలోనే తన కొడుకు కోసం హార్దిక్ పాండ్యా రూ.4 కోట్ల విలువైన ల్యాండ్ రోవర్ డిఫెండర్ అనే లగ్జరీ కారును బహుమతిగా అందించాడు. ముంబైకి చేందిన ఒక ప్రముఖ కార్ డీలర్షిప్ సంస్థ ఈ కారు బహుమతి కార్యక్రమం యొక్క ఫొటోలను సోషల్ మీడియాలో పంచుకోవడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఈ ఫొటోల్లో నటాషా స్టాంకో విచ్తో పాటు కుమారుడు అగస్త్య ఉన్నాడు. బ్లాక్ కలర్ ల్యాండ్ రోవర్ కారుతో ఈ ఇద్దరు ఫొటోలకు ఫోజిచ్చారు. ఈ ఫొటోలో పప్పా గిఫ్ట్ అనే బోర్డు కనిపించింది.

'హార్దిక్ పాండ్యా మరోసారి డిఫెండర్ కారును కొనుగోలు చేయడానికి మా కంపెనీని ఎంచుకున్నారు. ఇది నమ్మకంపై నిర్మించిన బంధం. ఈ కారును ముంబైలో అగస్త్య పాండ్యా, నటాషా స్టాంకోవిచ్లకు అందజేశాం.'అని సదరు సంస్థ పేర్కొంది.
హార్దిక్ పాండ్యా, నటాషా జూలై 2024లో అధికారికంగా విడాకులు తీసుకున్నారు. విడాకులు తీసుకొని రెండేళ్లు గడిచినా కుమారుడు అగస్త్య కోసం ఇద్దరూ సమాన బాధ్యతను పంచుకుంటున్నారు. హార్దిక్ పాండ్యా మహికా శర్మతో సహజీవనం చేస్తున్నప్పటికీ.. తన కొడుకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నాడు. మరోవైపు ఫిట్నెస్పై ఫోకస్ పెట్టిన నటాషా.. సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చేందుకు సిద్దమవుతోంది.
తన జీవితంలో ఎదురైన సవాళ్లు తనను మరింత బలంగా తయారు చేశాయని ఓ ఇంటర్వ్యూలో ఆమె పేర్కొంది. విడాకుల అనంతరం కూడా తన కొడుకు, మాజీ సతీమణికి ఖరీదైన కారును గిఫ్ట్గా ఇచ్చిన హార్దిక్ పాండ్యాను అభిమానులు ప్రశంసిస్తున్నారు. కనీసం మాజీ సతీమణి ముఖం చూడటానికి కూడా ఇష్టపడని ఈ రోజుల్లో తన కొడుకు కోసం హార్దిక్ ఖరీదైన కారు గిఫ్ట్ ఇవ్వడం గొప్ప విషయమని కొనియాడుతున్నారు.