చెన్నై: చెన్నై సూపర్ కింగ్స్ సారథి మహేంద్ర సింగ్ ధోనీ సూపర్ కెప్టెన్సీ వల్లే ఓటమిపాలయ్యామని గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా అన్నాడు. ఐపీఎల్ 2023 సీజన్లో భాగంగా చెన్నైతో మంగళవారం జరిగిన క్వాలిఫయర్-1లో గుజరాత్ టైటాన్స్ 15 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఈ మ్యాచ్ అనంతరం తమ ఓటమిపై స్పందించిన హార్దిక్ పాండ్యా.. ఈ గెలుపు క్రెడిట్ పూర్తిగా ధోనీదేనన్నాడు.
అతని అద్భుతమైన సారథ్యం కారణంగానే తమ జట్టు ఓటమిపాలైందన్నాడు. ధోనీ బౌలింగ్ మార్పులతో తమ బ్యాటర్లు వరుసగా పెవిలియన్ చేరారని తెలిపాడు. ధోనీ ఉన్నాడంటే చేధించాల్సిన లక్ష్యం 10 పరుగులు పెరిగినట్లేనని చెప్పుకొచ్చాడు. 'ఈ మ్యాచ్లో మేం స్పాట్ ఆన్గానే ఆడాం. కానీ బేసిక్ తప్పిదాలు చేశాం. అసాధారణమైన బౌలర్లు ఉనప్పటికీ 15 పరుగులు అదనంగా ఇచ్చాం. పరిస్థితులకు తగ్గట్లు బౌలింగ్ చేయలేకపోయాం.

చాలా సాఫ్ట్ బాల్స్ వేసి పరుగులు ఇచ్చుకున్నాం. ఈ పరాజయం పట్ల చింతించడం లేదు. మాకు మరో మ్యాచ్ ఆడే అవకాశం ఉంది. ధోనీ కెప్టెన్సీ మార్కే ఇది. అతని మాస్టర్ మైండ్, బౌలర్లను ఉపయోగించిన తీరు అమోఘం. ధోనీ తన సారథ్యంతో లక్ష్యానికి అదనంగా 10 పరుగులు కలిపాడు. అతను తరుచూ బౌలర్లుగా మార్చగా.. మేం వరుసగా వికెట్లు కోల్పోయాం. ఈ విజయం క్రెడిట్ ధోనీదే.
ఆదివారం జరిగే ఫైనల్లో మళ్లీ ధోనీతో తలపడతామని ఆశిస్తున్నా. జీవితంతో పశ్చాతాపాలు ఉండకూడదు. తేమ వస్తుందని మేం భావించాం. కానీ రాలేదు. బ్యాటింగ్, బౌలింగ్లో సరిగ్గా ఆడలేకపోయాం. రెండు రోజుల తర్వాత తప్పకుండా ఈ ఓటమికి బదులు తీర్చుకుంటాం. రేపు జరిగే ఎలిమినేటర్ మ్యాచ్లో మా బ్రదర్స్ తలపడుతున్నారు. తప్పకుండా చూస్తా.'అని హార్దిక్ పాండ్యా చెప్పుకొచ్చాడు.

ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 172 పరుగులు చేసింది. ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్(44 బంతుల్లో 7 ఫోర్లు, సిక్స్తో 60) హాఫ్ సెంచరీతో చెలరేగగా.. డెవాన్ కాన్వే(34 బంతుల్లో 4 ఫోర్లతో 40), రవీంద్ర జడేజా(16 బంతుల్లో 2 ఫోర్లతో 22) పర్వాలేదనిపించారు.
గుజరాత్ బౌలర్లలో మహమ్మద్ షమీ, మోహిత్ శర్మ రెండేసి వికెట్లు తీయగా.. దర్శన్ నల్కండే, రషీద్ ఖాన్, నూర్ అహ్మద్, మోమిత్ శర్మ తలో వికెట్ తీసారు.
అనంతరం గుజరాత్ టైటాన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 157 పరుగులకు కుప్పకూలింది. శుభ్మన్ గిల్(38 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్తో 42), రషీద్ ఖాన్(16 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్లతో 30) మినహా అంతా విఫలమయ్యారు. చెన్నై బౌలర్లలో దీపక్ చాహర్, మహీశ్ తీక్షణ, రవీంద్ర జడేజా రెండు వికెట్లు తీయగా.. తుషార్ దేశ్పాండే, మతీశ పతీరణ తలో వికెట్ తీసారు.