బ్యాటింగ్, బౌలింగ్ వైఫల్యంతో పాటు చెత్త ఫీల్డింగ్ తమ ఓటమిని శాసించిందని ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా తెలిపాడు. ఐపీఎల్ 2025 సీజన్లో భాగంగా గుజరాత్ టైటాన్స్తో శనివారం జరిగిన మ్యాచ్లో ముంబై ఇండియన్స్ 36 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఈ మ్యాచ్ అనంతరం తమ పరాజయంపై స్పందించిన హార్దిక్ పాండ్యా.. బౌలింగ్లో 15-20 పరుగులు అదనంగా ఇవ్వడం విజయవకాశాలను దెబ్బతీసిందన్నాడు. గుజరాత్ ఓపెనర్లు అద్బుతంగా బ్యాటింగ్ చేశారని కొనియాడాడు.
'బ్యాటింగ్, బౌలింగ్లో 15-20 పరుగులు తక్కువ చేశాం. మైదానంలో ప్రొఫెషనల్గా వ్యవహరించలేదు. ఫీల్డింగ్లో బేసిక్ తప్పిదాలు చేయడంతో 20-25 పరుగులు అదనంగా ఇచ్చాం. టీ20 గేమ్లో ఇవి చాలా ఎక్కువ. గుజరాత్ టైటాన్స్ ఓపెనర్లు అద్భుతంగా బ్యాటింగ్ చేశారు. ఎలాంటి రిస్కీ షాట్స్ ఆడకుండా తెలివిగా పరుగులు రాబట్టారు. మేం మెరుగ్గా రాణించే ప్రయత్నం చేశాం. కానీ విజయాన్ని అందుకోలేకపోయాం.

ఈ ఓటమికి మేమంతా బాధ్యత తీసుకోవాలి. టోర్నీ ఆరంభం దశలోనే ఉన్నాం. బ్యాటర్లు రాణించాలి. త్వరలోనే వారు ఫామ్ అందుకుంటారని ఆశిస్తున్నా. ఈ వికెట్పై స్లోయర్ బాల్స్ కఠినంగా మారాయి. కొన్ని బౌన్స్ అయితే మరికొన్ని వికెట్ టు వికెట్ వచ్చాయి. ఆ బంతులను ఎదుర్కోవడం బ్యాటర్లకు కష్టమైంది. నా బౌలింగ్లో నేను ఏదైతే చేశానో.. గుజరాత్ బౌలర్లు అదే చేశారు.'అని హార్దిక్ పాండ్యా చెప్పుకొచ్చాడు.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్..నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 196 పరుగులు చేసింది. సాయి సుదర్శన్(41 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్లతో 63) హాఫ్ సెంచరీతో రాణించగా.. శుభ్మన్ గిల్(27 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్తో 38), జోస్ బట్లర్(24 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్తో 39) కీలక ఇన్నింగ్స్ ఆడారు. ముంబై బౌలర్లలో హార్దిక్ పాండ్యా(2/29) రెండు వికెట్లు తీయగా.. ట్రెంట్ బౌల్ట్, దీపక్ చాహర్, ముజీబ్ ఉర్ రెహ్మా న్, సత్యనారాయణ రాజు తలో వికెట్ తీసారు.
అనంతరం ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 160 పరుగులే చేసి ఓటమిపాలైంది. సూర్యకుమార్ యాదవ్(28 బంతుల్లో ఫోర్, 4 సిక్స్లతో 48), తిలక్ వర్మ(36 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్తో 39)మినహా అంతా విఫలమయ్యారు. గుజరాత్ బౌలర్లలో సిరాజ్, ప్రసిధ్ కృష్ణ రెండేసి వికెట్లు తీయగా.. కగిసో రబడా, సాయి కిషోర్ తలో వికెట్ తీసారు.