అహ్మదాబాద్: ఐపీఎల్ 2023 సీజన్లో గుజరాత్ టైటాన్స్కు మరో ఓటమి ఎదురైంది. రాజస్థాన్ రాయల్స్తో ఆదివారం జరిగిన మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ 3 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. అయితే ఈ ఓటమిని తాము అస్సలు ఊహించలేదని గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా అన్నాడు. మ్యాచ్ అనంతరం మాట్లాడిన హార్దిక్ పాండ్యా తమ ఓటమికి గల కారణాలను వెల్లడించాడు.
పవర్ ప్లేలోనే కీలక రెండు వికెట్లు తీయడంతో పాటు స్వల్ప స్కోర్కే రాజస్థాన్ను కట్టడి చేశామని హార్దిక్ పాండ్యా చెప్పాడు. కానీ టీ20 గేమ్ బ్యూటీ ఇదేనని, చివరి ఓవర్ వరకు మ్యాచ్ ఫలితం తేలదని, ఈ ఓటమి తమకు మరో గుణపాఠమని పేర్కొన్నాడు.

'పవర్ ప్లేలో అద్భుత బౌలింగ్ ప్రదర్శన తర్వాత ఈ మ్యాచ్లో ఓటమిపాలవుతామని అస్సలు ఊహించలేదు. కానీ బ్యూటీ ఆఫ్ ద గేమ్ ఇదే. చివరి ఓవర్ వరకు మ్యాచ్ ఫలితం తేలదు. ఇది మాకు మరో గుణపాఠం. నూర్ అహ్మద్ బౌలింగ్ ఆడటం చాలా కష్టం. అతను మాకు సరైన సమయంలో బ్రేక్ త్రూ అందించాడు. కానీ ఇతర బౌలర్లు అతనికి అండగా రాణించలేకపోయారు.
నేను ఫిట్గానే ఉన్నాను. ఇది సుదీర్ఘ టోర్నీ. చాలా మ్యాచ్లు ఆడాల్సి ఉంది. ఈ మ్యాచ్లో మేం గేలిచినా.. జట్టుగా చాలా మ్యాచ్లు ఆడాల్సిందే. బ్యాటింగ్లో మేం 10 పరుగులు తక్కువ చేశాం. నేను ఔటైన తర్వాత రాజస్థాన్ కట్టడిగా బౌలింగ్ చేసింది. కానీ మా బ్యాటర్లు కాస్త కష్టపడి 200 పరుగులు చేయాల్సింది. అప్పటికీ చాలానే కవర్ చేశారు. కానీ ఆ లక్ష్యం సరిపోలేదు.'అని హార్దిక్ పాండ్యా చెప్పుకొచ్చాడు.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 177 పరుగులు చేసింది. డేవిడ్ మిల్లర్(30 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్లతో 46), శుభ్మన్ గిల్(34 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్తో 45) టాప్ స్కోరర్లుగా నిలవగా.. హార్దిక్ పాండ్యా(28), అభినవ్ మనోహర్(27) విలువైన పరుగులు చేశారు. రాజస్థాన్ రాయల్స్ బౌలర్లలో సందీప్ శర్మ రెండు వికెట్లు తీయగా.. ట్రెంట్ బౌల్ట్, ఆడమ్ జంపా, యుజ్వేంద్ర చాహల్ తలో వికెట్ తీసారు.
అనంతరం లక్ష్యచేధనకు దిగిన రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత 19.2 ఓవర్లలో 7 వికెట్లకు 179 పరుగులు చేసి గెలుపొందింది. హెట్మైర్(26 బంతుల్లో 2 ఫోర్లు, 5 సిక్స్లతో 56 నాటౌట్), కెప్టెన్ సంజూ శాంసన్(32 బంతుల్లో 3 ఫోర్లు, 6 సిక్స్లతో 60) హాఫ్ సెంచరీలతో రాణించారు. గుజరాత్ బౌలర్లలో మహమ్మద్ షమీ మూడు వికెట్లు తీయగా.. రషీద్ ఖాన్ రెండు వికెట్లు పడగొట్టాడు. హార్దిక్ పాండ్యా, నూర్ అహ్మద్ తలో వికెట్ తీసారు.