గయానా: వెస్టిండీస్తో రెండో టీ20లో తమ ఓటమికి చెత్త బ్యాటింగే కారణమని టీమిండియా కెప్టెన్ హార్దిక్ పాండ్యా అన్నాడు. తమ బ్యాటింగ్ విభాగం మరోసారి విఫలమైందని తెలిపాడు. వెస్టిండీస్తో ఆదివారం జరిగిన రెండో టీ20లో టీమిండియా 2 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. ఈ విజయంతో ఐదు టీ20ల సిరీస్లో వెస్టిండీస్ 2-0తో ఆధిక్యంలో నిలిచింది.
మ్యాచ్ అనంతరం ఈ పరాజయంపై స్పందించిన హార్దిక్ పాండ్యా.. 160 ప్లస్, 170 పరుగులు చేసుంటే ఫలితం మరోలా ఉండేదన్నాడు. నికోలస్ పూరన్ విధ్వంసకర బ్యాటింగ్తో స్పిన్నర్లను రొటేట్ చేయడం కష్టమైందని తెలిపాడు.

'నిజాయితీగా చెప్పాలంటే మా బ్యాటింగ్ ప్రదర్శన అత్యంత చెత్తగా ఉంది. మేం మెరుగ్గా బ్యాటింగ్ చేయలేకపోయాం. ఈ వికెట్పై 160+ లేదా 170 పరుగులు మంచి స్కోర్. నికోలస్ పూరన్ అసాధారణ బ్యాటింగ్ చేశాడు. అతను ఆడుతుంటే స్పిన్నర్లను రొటేట్ చేయడం చాలా కష్టమైంది. బంతిని ఎలా వేసినా బాదాడు. అతను బ్యాటింగ్ చేసిన తీరు అమోఘం.
లోయరార్డర్లో రవి బిష్ణోయ్ అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. ప్రస్తుతం మేం ఏడుగురు బ్యాటర్ల కాంబినేషన్తో బరిలోకి దిగుతున్నాం. చివరి మూడు స్థానాల్లో కూడా బ్యాటింగ్ బలం ఎలా లభిస్తుందో మా బ్యాటర్లు గమనించాలి. మరింత బాధ్యతగా ఆడాలి. తిలక్ వర్మ అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. నాలుగో స్థానంలో లెఫ్టాండర్ ఉండటం వల్ల మొత్తం లెఫ్ట్ రైట్ కాంబినేషన్ లభిస్తోంది.
అప్కమింగ్ మ్యాచ్ల్లోనైనా కుర్రాళ్లు మరింత ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగి ఫియర్లెస్ గేమ్ ఆడుతారని ఆశిస్తున్నా'అని హార్దిక్ పాండ్యా చెప్పుకొచ్చాడు.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 152 పరుగులు చేసింది. తెలుగు తేజం తిలక్ వర్మ(41 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్తో 51) ఒక్కడే హాఫ్ సెంచరీతో రాణించగా.. హార్దిక్ పాండ్యా(24), ఇషాన్ కిషన్(27), శుభ్మన్ గిల్(7), సూర్యకుమార్ యాదవ్(1), సంజూ శాంసన్(7) దారుణంగా విఫలమయ్యారు. వెస్టిండీస్ బౌలర్లలో అకీల హొస్సెన్, అల్జారీ జోసెఫ్, రొమారియో షెఫెర్డ్ రెండేసి వికెట్లు తీసారు.
అనంతరం లక్ష్యచేధనకు దిగిన వెస్టిండీస్ 18.5 ఓవర్లలో 155 పరుగులు చేసి గెలుపొందింది. నికోలస్ పూరన్(40 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్స్లతో 67) విధ్వంసకర హాఫ్ సెంచరీతో చెలరేగగా.. చివర్లో అకీల హోస్సెన్(16 నాటౌట్), అల్జారీ జోసెఫ్(10 నాటౌట్) విలువైన పరుగులు చేశారు. భారత బౌలర్లలో హార్దిక్ పాండ్యా 3 వికెట్లు తీయగా.. యుజ్వేంద్ర చాహల్ రెండు వికెట్లు పడగొట్టాడు. అర్ష్దీప్ సింగ్, ముకేశ్ కుమార్ చెరో వికెట్ తీసారు.