రాయ్పూర్: న్యూజిలాండ్తో రెండో వన్డేలో అవకాశాలు అందిపుచ్చుకున్నామని టీమిండియా స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా అన్నాడు. సరైన ప్రదేశాల్లో బంతిని హిట్ చేసి వికెట్లు సాధించామని తెలిపాడు. పిచ్ మరీ బ్యాటింగ్కు ప్రతికూలంగా లేదని, న్యూజిలాండ్ బ్యాటర్లు ఆడలేకపోయారని అభిప్రాయపడ్డాడు. రాయ్పూర్ వేదికగా జరుగుతున్న రెండో వన్డేలో భారత బౌలర్లు మహమ్మద్ షమీ(3/18), హార్దిక్ పాండ్యా(2/16), వాషింగ్టన్ సుందర్(2/7) విజృంభించడంతో న్యూజిలాండ్ 34.3 ఓవర్లలోనే 108 పరుగులకే కుప్పకూలింది. గ్లేన్ ఫిలిప్స్(52 బంతుల్లో 5 ఫోర్లతో 36), మైకేల్ బ్రేస్వెల్(30 బంతుల్లో 4 ఫోర్లతో 22) టాప్ స్కోరర్లుగా నిలిచారు. 15 పరుగులకే 5 వికెట్లు కోల్పోయిన న్యూజిలాండ్ చివరకు 100 పరుగుల మార్క్ను ధాటి పరువును కాపాడుకుంది.
ఈ ఇన్నింగ్స్ అనంతరం అధికారిక బ్రాడ్కాస్టర్ స్టార్ స్పోర్ట్స్తో హార్దిక్ పాండ్యా మాట్లాడాడు. 'ఇది మాకు అద్భుతమైన రోజు. వికెట్ను మేం సరైన రీతిలో వాడుకున్నాం. దాంతో మాకు ఫలితం దక్కింది. ప్రతీ మ్యాచ్కు నా శరీరం మరింత మెరుగవుతోంది. ఫిట్గా ఉండటంతోనే రిటర్న్ క్యాచ్ అందుకున్నాను. బంతి అద్భుతంగా దూసుకురావడంతో పాటు టైమ్ కుదరడంతో పట్టగలిగాను. ఈ మ్యాచ్లో మేం సరైన ప్రదేశాల్లో బంతిని హిట్ చేస్తూ.. బ్యాటర్లకు పరీక్ష పెట్టాం. బ్యాటర్ల ఎడ్జెస్ను ఫీల్డర్లు అద్భుతంగా అందుకున్నారు. ఇదేం 108 పరుగులే చేయగల పిచ్ ఏం కాదు. కానీ మేం అవకాశాలను సృష్టించుకొని చెలరేగాం. ఎలా బ్యాటింగ్ చేయాలనేది మా బ్యాటర్లు నిర్ణయిస్తారు.'అని హార్దిక్ పాండ్యా చెప్పుకొచ్చాడు. భారత్పై న్యూజిలాండ్కు ఇది రెండో అత్యల్ప వన్డే స్కోర్.
న్యూజిలాండ్ 108 పరుగులకే ఆలౌటవ్వడంతో పిచ్పై విమర్శలు వస్తున్నాయి. అసలే వన్డే క్రికెట్కు ఆదరణ తగ్గుతుందని బాధపడుతున్న క్రమంలో.. ఇలాంటి వికెట్లు మరింత నష్టం చేస్తాయని ఫ్యాన్స్ మండిపడుతున్నారు. పూర్తిగా గ్రీన్ వికెట్ తయారు చేయాల్సిన అవసరం ఏంటని ప్రశ్నిస్తున్నారు. భారత్ టాస్ ఓడి ముందు బ్యాటింగ్ చేస్తే పరిస్థితి ఇలానే ఉండేదని మండిపడుతున్నారు.