రోమారియో షెఫర్డ్ సంచలన బ్యాటింగ్తోనే ఐపీఎల్ 2024 సీజన్లో తొలి విజయాన్ని నమోదు చేశామని ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా తెలిపాడు. ఢిల్లీ క్యాపిటల్స్తో ఆదివారం జరిగిన మ్యాచ్లో సమష్టిగా రాణించిన ముంబై ఇండియన్స్ 29 పరుగుల తేడాతో గెలుపొందింది.
ఈ మ్యాచ్ అనంతరం మాట్లాడిన హార్దిక్ పాండ్యా.. ఈ విజయం కోసం ఎంతో కష్టపడ్డామని తెలిపాడు. 'ఈ గెలుపు కోసం చాలా కష్టపడ్డాను. స్పష్టమైన ప్రణాళికలతో బరిలోకి దిగాం. ఈ మ్యాచ్లో మేం కొన్ని వ్యూహాత్మక మార్పులు చేశాం. అయితే మా 12 ప్లేయర్ కాంబినేషన్ సెట్ అవ్వడం చాలా ముఖ్యం.

డ్రెస్సింగ్ రూమ్ వాతావరణం చాలా బాగుంది. ఒకరిపై ఒకరు నమ్మకం ఉంచుకోవడంతో పాటు మద్దతు తెలుపుకుంటున్నాం. జట్టులో ప్రతీ ఒక్కరు మాకు ఒక్క విజయం కావాలని భావించారు. ఈ మ్యాచ్ను మేం అద్భుతంగా ప్రారంభించాం. తొలి 6 ఓవర్లలోనే 70 పరుగుల చేయడం అద్భుతం. జట్టులోని ప్రతీ ఒక్కరు సత్తా చాటడం బాగుంది. రోమారియో షెఫర్డ్ ఇన్నింగ్స్ సూపర్.
అతనే మాకు విజయాన్ని అందించాడు. ఈ మ్యాచ్లో మా విజయానికి, ఢిల్లీ ఓటమికి అతని ఇన్నింగ్సే ప్రధాన కారణం. అతని బ్యాటింగ్ నాకు ఎంతో ఇచ్చింది. రొమారియో షెఫర్డ్ ముఖంలో ఎప్పుడూ చిరునవ్వు ఉంటుంది. నేను బౌలింగ్ చేయకపోవడానికి ఎలాంటి కారణం లేదు. నేనేం పరుగెత్తడం లేదు. నాకు ఎలాంటి ఫిట్నెస్ సమస్యలు లేవు.
సరైన సమయంలో నేను బౌలింగ్ చేస్తాను. ఈ మ్యాచ్లో మేం ప్రతీ విషయంలో మెరుగైన ప్రదర్శన చేశాం.'అని హార్దిక్ పాండ్యా చెప్పుకొచ్చాడు.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 234 పరుగుల భారీ స్కోర్ చేసింది. రోమారియో షెఫర్డ్ (10 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స్లతో 39 నాటౌట్) విధ్వంసకర బ్యాటింగ్తో చెలరేగాడు.
అనంతరం ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 205 పరుగులే చేసి ఓటమిపాలైంది. పృథ్వీ షా(40 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్స్లతో 66), ట్రిస్టన్ స్టబ్స్(25 బంతుల్లో 3 ఫోర్లు, 7 సిక్స్లతో 71 నాటౌట్) రాణించినా ఫలితం లేకపోయింది.