పల్లెకెలె: కఠిన పరిస్థితుల్లో బ్యాటింగ్ చేయడం తనకు చాలా ఇష్టమని టీమిండియా వైస్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా తెలిపాడు. ఆసియాకప్ 2023లో భాగంగా పాకిస్థాన్తో శనివారం జరిగిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దయిన విషయం తెలిసిందే. టీమిండియా ఇన్నింగ్స్ ముగిసిన తర్వాత ఎడతెరిపి లేకుండా వర్షం పడటంతో పాకిస్థాన్ ఇన్నింగ్స్ సాధ్యమవ్వలేదు.
దాంతో కటాఫ్ టైమ్ వరకు వేచి చూసిన అంపైర్లు చివరకు మ్యాచ్ను రద్దు చేసి చెరో పాయింట్ కేటాయించారు. అయితే ఈ మ్యాచ్లో టీమిండియా ముందుగా బ్యాటింగ్ చేయగా.. పాకిస్థాన్ బౌలర్లు షాహిన్ షా అఫ్రిది, హ్యారీస్ రౌఫ్ నిప్పులు చెరగడంతో భారత్ టాపార్డర్ కుప్పకూలింది.

66 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడిన భారత జట్టును ఇషాన్ కిషన్(81 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్స్లతో 82), హార్దిక్ పాండ్యా(90 బంతుల్లో 7 ఫోర్లు, సిక్స్తో 87) హార్దిక్ పాండ్యా ఆదుకున్నారు. ఐదో వికెట్కు 138 పరుగుల రికార్డు భాగస్వామ్యం నెలకొల్పి భారత్కు 266 పరుగుల భారీ స్కోర్ అందించారు.
వర్షం కారణంగా ఈ మ్యాచ్ ఫలితం తేలకపోయినా.. ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా అసాధారణ ఇన్నింగ్స్పై సర్వత్రా ప్రశంసల జల్లు కురిపిస్తోంది. ఈ ఇన్నింగ్స్పై తాజాగా స్పందించిన హార్దిక్ పాండ్యా సంతోషం వ్యక్తం చేశాడు. తీవ్ర ఒత్తిడిలో ఆడటం తనకు ఇష్టమని, ఇలాంటి పరిస్థితుల్లో ఆడితేనే హీరోలయ్యేందుకు ఆస్కారం ఉంటుందని తెలిపాడు. ఈ తరహా ఇన్నింగ్స్లో జీవితంలో మధురానుభూతులుగా మిగిలిపోతాయని చెప్పాడు.
'కఠిన పరిస్థితుల్లో ఎదురయ్యే సవాళ్లను స్వీకరించడం నాకు చాలా ఇష్టం. ఈ తరహా చాలెంజ్లను స్వీకరించేందుకు నేను ముందుంటాను. హీరో అయ్యేందుకు ఈ తరహా సవాళ్లు మంచి అవకాశం. జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు చేసిన పరుగులు ఓ మధురానుభూతిగా జీవితాంతం ఉంటాయి.'అని హార్దిక్ పాండ్యా చెప్పుకొచ్చాడు.
పాకిస్థాన్తో మ్యాచ్లో వైస్ కెప్టెన్గా హార్దిక్ పాండ్యా తన టెంపర్ను చూపించాడు. కుదురుకునే వరకు కాస్త నెమ్మదిగా ఆడిన అతను.. ఆ తర్వాత తనదైన షాట్లతో చెలరేగాడు. ఇషాన్ కిషన్ ఔటైన తర్వాత ఓవరాక్షన్ చేసిన హ్యారీస్ రౌఫ్కు వరుస బౌండరీలతో బుద్ది చెప్పాడు. హార్దిక్ పాండ్యా ఇదే జోరును కొనసాగిస్తే.. టీమిండియాకు తిరుగుండదని మాజీ క్రికెటర్లు అభిప్రాయపడుతున్నారు.