న్యూఢిల్లీ: ఆల్రౌండర్ ఆడగలిగే సామర్థ్యం ఉంటేనే భారత జట్టు తరఫున బరిలోకి దిగుతానని చెప్పానని టీమిండియా వైస్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా అన్నాడు. పదే పదే ఫిట్నెస్ సమస్యలు ఎదుర్కొంటున్న హార్దిక్ పాండ్యా తరుచూ జట్టుకు దూరమవుతున్నాడు. ఒకవేళ మ్యాచ్ బరిలోకి దిగినా బ్యాటింగ్కు మాత్రమే పరిమితమవుతున్నాడు.
ఐపీఎల్ 2023 సీజన్లోనూ నాలుగు ఓవర్లు పూర్తిగా వేయలేదు. బ్యాటింగ్లో మాత్రం సత్తా చాటాడు. వన్డే ప్రపంచకప్ కోసం సిద్దమవుతున్న టీమిండియాకు హార్దిక్ రీఎంట్రీ ఇవ్వడం కలిసొచ్చే అంశం. వెస్టిండీస్తో తొలి వన్డేలో మూడు ఓవర్లు బౌలింగ్ చేసిన హార్దిక్.. 17 పరుగులు ఇచ్చి ఓ కీలక వికెట్ తీసాడు. బ్యాటింగ్లో మాత్రం రనౌట్ అయ్యాడు.

అయితే జట్టులోకి వచ్చేందుకు తాను పూర్తి ఫిట్నెస్ సాధించానని హార్దిక్ తెలిపాడు. ఈ మ్యాచ్ సందర్బంగా అధికారిక బ్రాడ్కాస్టర్తో మాట్లాడిన హార్దిక్.. గాయం తిరగబెట్టడంతోనే ఇన్నాళ్లు విశ్రాంతి తీసుకున్నట్లు చెప్పాడు. 'గాయం తిరగబెట్టడంతో విశ్రాంతి తీసుకున్నా. దాంతో ఇంటికే పరిమితమయ్యా. ఇంట్లో ఉన్నా వ్యాయామాలు చేస్తూనే ఫిట్ అయ్యేందుకు ప్రయత్నించా.
ఈ సందర్భంగా భారత జట్టులోని సహచరులకు నేను ఒకటే చెప్పా. తిరిగి జట్టులోకి వచ్చానంటే ఆల్రౌండర్ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తా. లేకపోతే జట్టు తరఫున ఆడకుండా పక్కకు తప్పుకుంటానని చెప్పేశా. అది నాకు చాలా ఛాలెంజింగ్ టైమ్. అలాంటి పరిస్థితుల్లో ఆడకుండా ఉంటేనే సంతోషం. అనవసరంగా జట్టులోకి వచ్చి మరొక ఆటగాడి స్థానాన్ని ఆక్రమించినట్లు అవుతుంది'' అని పాండ్యా చెప్పుకొచ్చాడు.
విండీస్తో తొలి వన్డేలో బౌలింగ్లో ఫర్వాలేదనిపించిన హార్దిక్ పాండ్యా(5)ను బ్యాటింగ్లో దురదృష్టం వెంటాడింది. ఇషాన్ కిషన్ కొట్టిన బంతి బౌలర్ చేతిని తాకుతూ నాన్స్ట్రైకర్ ఎండ్లోని వికెట్లను తాకింది. అప్పటికే హార్దిక్ క్రీజును ధాటడంతో రనౌట్ అవ్వక తప్పలేదు. ఈ మ్యాచ్లో టీమిండియా 5 వికెట్ల తేడాతో గెలుపొందింది.
భారత స్పిన్నర్లు రవీంద్ర జడేజా(3/37), కుల్దీప్ యాదవ్(4/6) ధాటికి ముందుగా బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ 23 ఓవర్లలో 114 పరుగులకే కుప్పకూలింది. విండీస్ బ్యాటర్లలో షై హోప్ (45 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్తో 43) మినహా అంతా విఫలమయ్యారు. భారత స్పిన్నర్లకు తోడుగా హార్దిక్ పాండ్యా, ముకేష్ కుమార్, శార్దూల్ ఠాకూర్ తలో వికెట్ తీసారు.
అనంతరం లక్ష్యచేధనకు దిగిన భారత్ 22.5 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 118 పరుగులు చేసి గెలుపొందింది. ఇషాన్ కిషన్(46 బంతుల్లో 7 ఫోర్లు, సిక్స్తో 52) హాఫ్ సెంచరీతో రాణించాడు. ఇరు జట్ల మధ్య రెండో వన్డే శనివారం జరగనుంది.