కఠిన పరిస్థితులను ఎదుర్కోవాలనే...
మ్యాచ్ అనంతరం ఈ నిర్ణయంపై హార్దిక్ పాండ్యా క్లారిటీ ఇచ్చాడు. 'జట్టును కఠిన పరిస్థితుల్లో నెట్టేయాలని అనుకున్నాను. ఎందుకంటే ఈ అనుభవం బిగ్ మ్యాచ్లలో ఉపయోగపడుతుందని ఇలా చేశాను. ద్వైపాక్షిక సిరీస్ల్లో మేం అద్భుతంగా రాణిస్తాం. అందుకే మాకు మేం సవాల్ చేసుకుంటున్నాం. నిజాయితీగా చెప్పాలంటే ఈ రోజు కఠిన పరిస్థితులను యువ ఆటగాళ్లు జయించారు.'అని హార్దిక్ చెప్పుకొచ్చాడు.
అయితే అక్షర్ పటేల్ వేసిన ఆఖరి ఓవర్లో కరుణరత్నే భారీ సిక్సర్ బాదడంతో భారత్కు ఓటమి తప్పదని, అనవసర ప్రయత్నాలతో విజయవకాశాలను దెబ్బతీసుకున్నారనే అభిప్రాయం వ్యక్తమైంది. కానీ అక్షర్కు అండగా నిలిచిన హార్దిక్.. ప్రణాళిక ప్రకారం బంతులు వేయాలని, ఫలితం గురించి ఆలోచించకూడదని పదే పదే చెప్పాడు. చివరి మూడు బంతులు కట్టడిగా వేయడంతో భారత్ విజయం ఖాయమైంది.

జస్ట్ క్రాంప్స్ మాత్రమే..
తనకు ఎలాంటి గాయమవ్వలేదని చెప్పిన హార్దిక్ పాండ్యా.. క్రాంప్స్తో ఇబ్బంది పడ్డానని తెలిపాడు.'నాకు ఎలాంటి గాయం కాలేదు. కాళ్లకు తిమ్మిర్లు మాత్రమే వచ్చాయి. నేను నవ్వితే పరిస్థితి బాగానే ఉంటుందని భావిస్తరని నా ఫేస్ను భయానకంగా పెట్టాను. సరిగ్గా నిద్రపోకపోవడం.. తగినన్ని నీళ్లు తాగకపోవడం వల్ల కండరాలు పట్టేసాయి. నేను పూర్తి ఫిట్గా ఉన్నాను. కెప్టెన్ అని పిలవడం చాలా ప్రత్యేకంగా ఉంది.

శివమ్ మావి సత్తా అప్పుడే చూశా..
శివమ్ మావి అసాధారణ బౌలింగ్తో ఆకట్టుకున్నాడు. ఐపీఎల్లోనే అతను అద్భుతంగా బౌలింగ్ చేయడం గమనించాను. అతని బలబలాలు ఏంటో నాకు బాగా తెలుసు. బ్యాటర్లు ఎదురు దాడికి దిగుతున్నారని ఆందోళనపడవద్దని చెప్పాను. నీపై నమ్మకంగా ఉండి బౌలింగ్ చేయాలని చెప్పాను. ఇక నా స్వింగ్ బౌలింగ్పై వర్క్ చేశాను. ఇన్ స్వింగర్ కోసం కూడా ప్రయత్నిస్తున్నాను. కొత్త బంతితో నెట్స్లో చెమటోడుస్తున్నాను'అని హార్దిక్ పాండ్యా చెప్పుకొచ్చాడు.

దీపక్ హుడా విధ్వంసం..
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 162 పరుగులు చేసింది. దీపక్ హుడా(23 బంతుల్లో ఫోర్, 4 సిక్సర్లతో 41 నాటౌట్), అక్షర్ పటేల్(20 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్తో 31 నాటౌట్) అసాధారణ బ్యాటింగ్తో చెలరేగగా.. హార్దిక్ పాండ్యా(29), ఇషాన్ కిషన్ పర్వాలేదనపించారు. లంక బౌలర్లలో దిల్షాన్, మహీశ్ తీక్షణ, చమిక కరుణరత్నే, ధనుంజ డిసిల్వా, వానిందు హసరంగా ఐదు వికెట్లు పడగొట్టారు.
అనంతరం లక్ష్యచేధనకు దిగిన శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో 160 పరుగులకు కుప్పకూలింది. డసన్ షనక(27 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్లతో 45), చమిక కరుణరత్నే(16 బంతుల్లో 2 సిక్సర్లతో 23 నాటౌట్) పోరాడినా ఫలితం లేకపోయింది. భారత బౌలర్లలో శివమ్ మావి నాలుగు వికెట్లు తీయగా.. ఉమ్రాన్ మాలిక్, హర్షల్ పటేల్ రెండేసి వికెట్లు తీసారు.


Click it and Unblock the Notifications
