కీలక సమయంలో తాను ఔటవ్వడమే తమ ఓటమిని శాసించిందని ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా తెలిపాడు. ఐపీఎల్ 2024 సీజన్లో భాగంగా రాజస్థాన్ రాయల్స్తో జరిగిన మ్యాచ్లో ముంబై ఇండియన్స్ 6 వికెట్ల తేడాతో చిత్తయ్యింది. ఈ సీజన్లో ముంబై ఇండియన్స్కు ఇది హ్యాట్రిక్ పరాజయం.
ఈ మ్యాచ్ అనంతరం తమ ఓటమిపై స్పందించిన హార్దిక్ పాండ్యా.. బ్యాటింగ్లో తాను ఇంకొంచెం మెరుగైన ప్రదర్శన చేయాల్సిందని అభిప్రాయపడ్డాడు. 'మా ప్రణాళికలకు తగ్గట్లు మేం బ్యాటింగ్ చేయలేకపోయాం. సరైన ఆరంభం అందుకోలేకపోయాం. ఈ ఓటమి తీవ్ర నిరాశకు గురిచేసింది.

అయితే ఓ దశలో మేం మంచి స్థితిలో నిలిచాం. సునాయసంగా 150-160 పరుగులు చేస్తామని భావించాం. కానీ నా వికెట్ మ్యాచ్ను మలుపు తిప్పింది. రాజస్థాన్ రాయల్స్ మరింత పట్టు బిగించేలా చేసింది. నేను ఇంకాస్త మెరుగ్గా బ్యాటింగ్ చేయాల్సింది.
పిచ్ బౌలర్లకు అనుకూలంగా ఉంది. కానీ వికెట్ ఇంతలా బౌలర్లకు సహకరిస్తుందని మేం ఊహించలేదు. ఫలితాలు కొన్నిసార్లు ప్రతికూలంగానే వస్తాయి. ఈ ఓటములకు నేనేం బాధపడటం లేదు. ఓ జట్టుగా ఈ పరాజయాల నుంచి తేరుకుంటామనే నమ్మకం ఉంది. అయితే మేం కాస్త క్రమశిక్షణతో ఆడాల్సిన అవసరం ఉంది.'అని హార్దిక్ పాండ్యా చెప్పుకొచ్చాడు.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 125 పరుగులే చేసింది. కెప్టెన్ హార్దిక్ పాండ్యా(21 బంతుల్లో 6 ఫోర్లతో 34), తిలక్ వర్మ(29 బంతుల్లో 2 సిక్స్లతో 32) మినహా అంతా విఫలమయ్యారు. తిలక్తో కలిసి ఐదో వికెట్కు 56 పరుగులు జోడించిన అనంతరం యుజ్వేంద్ర చాహల్ బౌలింగ్లో భారీ షాట్కు ప్రయత్నించి హార్దిక్ పాండ్యా క్యాచ్ఔట్గా వెనుదిరిగాడు.
ఈ వికెట్ మ్యాచ్కు టర్నింగ్ పాయింట్గా నిలిచింది. అనంతరం రాజస్థాన్ రాయల్స్ 15.3 ఓవర్లలోనే 4 వికెట్లకు 127 పరుగులు చేసి సునాయస విజయాన్నందుకుంది. రియాన్ పరాగ్(39 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్లతో 54 నాటౌట్) అజేయ హాఫ్ సెంచరీతో సత్తా చాటాడు.