అహ్మదాబాద్: ఐపీఎల్ 2023 సీజన్లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్ చేతిలో ఎదురైన పరాజయానికి పూర్తి బాధ్యత తనదేనని గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా అన్నాడు. మ్యాచ్ను తానే పూర్తి చేయాల్సిందని అభిప్రాయపడ్డాడు. మంగళవారం ఆఖరి బంతి వరకు ఉత్కంఠగా సాగిన ఈ లోస్కోరింగ్ థ్రిల్లర్లో ఢిల్లీ క్యాపిటల్స్ 5 పరుగుల తేడాతో టేబుల్ టాపర్ గుజరాత్ టైటాన్స్ను ఓడించింది.
ఈ మ్యాచ్ అనంతరం తమ ఓటమిపై స్పందించిన హార్దిక్ పాండ్యా.. ఆరంభంలోనే వికెట్లు కోల్పోవడంతో పాటు తాను రిథమ్ అందుకోకపోవడం ఓటమికి దారి తీసిందన్నాడు. '129 పరుగుల లక్ష్యాన్ని ఏ రోజైనా మేం సునాయసంగా చేధించగలం. కానీ చివర్లో వికెట్లు కోల్పోవడం విజయవకాశాలు దెబ్బతీసింది. రాహుల్ తెవాటియా సూపర్ బ్యాటింగ్తో జట్టును విజయం ముంగిట నిలబెట్టాడు.

నేను నా సాయశక్తులా ఆడాను. కానీ ఫలితం ప్రతికూలంగా వచ్చింది. మిడిల్ ఓవర్లలో ఒక్క బిగ్ ఓవర్ దొరికినా చాలని అభినవ్ మనోహర్తో చెప్పాను. ఒకటి, రెండు లూజ్ ఓవర్లు లభిస్తాయని మేం ఆశించాం. కానీ మేం రిథమ్ అందుకోలేకపోయాం. అభినవ్కు కొత్త. నేనే మ్యాచ్ను ముగించాల్సింది. బౌలర్లు అద్భుత ప్రదర్శన కనబర్చారు. ఈ గెలుపు క్రెడిట్ వారిదే. ఈ ఓటమికి పూర్తి బాధ్యత నాదే.
పిచ్ బ్యాటింగ్కు అనుకూలంగానే ఉన్నా.. అనవసర ఒత్తిడికి లోనయ్యాం. ఢిల్లీ బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు. 10 ఓవర్లలో 80 పరుగులు చేయాల్సిన పరిస్థితుల్లో రాహుల్ తేవాటియా చెలరేగి ఆశలు రేకెత్తించాడు. నేను రిథమ్ అందుకోకపోవడంతో పాటు ఆరంభంలోనే వికెట్లు కోల్పోవడం మా ఓటమిని శాసించింది. మహమ్మద్ షమీ అసాధారణ ప్రదర్శన కనబర్చాడు. అతను అద్భుతంగా రాణించినా గెలవకపోవడం బాధగా ఉంది.
అసాధారణ బౌలింగ్తో తక్కువ స్కోర్కే కట్టడి చేసినా బ్యాటర్లు చేతులెత్తేసారు. వికెట్ ఎలా ఉన్నా.. షమీ బౌలింగ్కు పూర్తి క్రెడిట్ ఇవ్వాల్సిందే. ఇంకా చాలా మ్యాచ్లు ఆడాల్సి ఉంది. ఈ మ్యాచ్లో చేసిన తప్పిదాల నుంచి పాఠాలు నేర్చుకుంటాం. క్రికెట్లో ఇలాంటి పరాజయాలు ఎదురవ్వడం సర్వసాధారణం. బ్యూటీఆఫ్ ఐపీఎల్ ఇదే. ఇప్పటికీ మేం టేబుల్లో టాప్లోనే ఉన్నా.. మెరుగైన క్రికెట్ ఆడాల్సి ఉంది.'అని హార్దిక్ పాండ్యా చెప్పుకొచ్చాడు.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 130 పరుగులు చేసింది. 23 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడ్డ జట్టును ఆమన్ ఖాన్ (44 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్లతో 51) హాఫ్ సెంచరీతో ఆదుకున్నాడు. అతనికి తోడుగా అక్షర్ పటేల్(27), రిపల్ పటేల్(23) రాణించారు. గుజరాత్ బౌలర్లలో షమీ నాలుగు వికెట్లు తీయగా.. మోహిత్ శర్మ రెండు, నూర్ అహ్మద్ తలో వికెట్ పడగొట్టారు.
అనంతరం లక్ష్యచేధనకు దిగిన గుజరాత్ టైటాన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 125 పరుగులే చేసింది. హార్దిక్ పాండ్యా(53 బంతుల్లో 7 ఫోర్లతో 59 నాటౌట్) అజేయ హాఫ్ సెంచరీతో రాణించినా.. రాహుల్ తెవాటియా(7 బంతుల్లో 3 సిక్సర్లతో 20) మెరుపులు మెరిపించినా ఫలితం లేకపోయింది.