ఈజీగా గెలిచేవాళ్లం..
'మ్యాచ్ పూర్తిగా జరుగుంటే గెలిచేవాళ్లం. ఏదైనా మాకు మంచే జరిగింది. ఓ దశలో ఎదురుదాడికి దిగడమే ఈ వికెట్పై బెస్ట్ డిఫెన్స్ అనిపించింది. కివీస్ క్వాలిటీ బౌలింగ్ గురించి మాకూ పూర్తిగా అవగాహన ఉంది. అందుకే ఆరంభంలోనే వికెట్లు కోల్పోయినా ధాటిగా ఆడి 10-15 పరుగులు అదనంగా చేయడం ముఖ్యమని భావించాం.
ఇలాంటి మ్యాచ్లు మాలోని కొంతమంది ఆటగాళ్ల సత్తాకు పరీక్షగా నిలిచేవి. కానీ వర్షం కారణంగా పూర్తి మ్యాచ్ ఆడలేకపోయాం. అది మన చేతుల్లో లేనిది. ఇక ఈ సిరీస్ విజయంతో నా పని పూర్తయ్యింది. హాయిగా ఇంటికెళ్లి ఈ విశ్రాంత్రి సమయాన్ని నా కొడుకుతో గడుపుతా'అని హార్దిక్ చెప్పుకొచ్చాడు.
చెలరేగిన సిరాజ్, అర్ష్దీప్ సింగ్..
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 19.4 ఓవర్లలో 160 పరుగులకు కుప్పకూలింది. డేవాన్ కాన్వే(49 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో 59), గ్లేన్ ఫిలిప్స్(33 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్లతో 54) హాఫ్ సెంచరీలతో రాణించగా మిగతా బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు. ఈ జోడీ మూడో వికెట్కు 86 పరుగుల భాగస్వామ్యం అందించింది.
ఈ ఇద్దరూ భారీ షాట్లతో విరుచుకుపడటంతో ఓ దశలో కివీస్ 190 ప్లస్ స్కోర్ చేస్తుందని అంతా అనుకున్నారు. కానీ సిరాజ్ సూపర్ బౌలింగ్తో ఈ జోడీని విడదీసి కివీస్ పతనాన్ని శాసించాడు. భారత బౌలర్లలో అర్ష్దీప్ సింగ్, మహమ్మద్ సిరాజ్ నాలుగేసి వికెట్లు తీయగా... హర్షల్ పటేల్కు ఓ వికెట్ దక్కింది. సిరాజ్(4/17), అర్ష్దీప్ సింగ్(4/37)లు టీ20 ఫార్మాట్లో అత్యుత్తమ బౌలింగ్ గణంకాలు నమోదు చేశారు.
టాప్-4 విఫలం..
161 పరుగుల సాధారణ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా వర్షంతో మ్యాచ్ ఆగిపోయే సమయానికి 4 వికెట్లకు 75 పరుగులు చేసింది. క్రీజులో హార్దిక్ పాండ్యా(18 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్తో 30 నాటౌట్), దీపక్ హుడా(9 నాటౌట్) ఉన్నారు. వర్షం భారీగా రావడంతో డక్వర్త్ లూయిస్ ప్రకారం మ్యాచ్ ఫలితాన్ని తేల్చారు. అయితే ఈ పద్దతిన టీమిండియా సరిగ్గా అన్నే పరుగులు చేయడంతో టైగా ప్రకటించారు.
ఓపెనర్లు ఇషాన్ కిషన్(10), రిషభ్ పంత్(11) మరోసారి విఫలమవ్వగా.. శ్రేయస్ అయ్యర్(0) మరో అవకాశాన్ని చేజార్చుకున్నారు. గత మ్యాచ్ సెంచరీ హీరో సూర్యకుమార్ యాదవ్(13) సైతం విఫలమయ్యాడు. సూపర్ బౌలింగ్తో భారత్ విజయంలో కీలక పాత్ర పోషించిన సిరాజ్కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ దక్కింది.