
ముంబై: పంజాబ్ కింగ్స్ చేతిలో ఓటమికి ముందుగా బ్యాటింగ్ చేయడం ఏ మాత్రం కారణం కాదని గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా అన్నాడు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకోవడాన్ని హార్దిక్ సమర్థించుకున్నాడు. ఎప్పుడు కంఫర్ట్ జోన్లోనే ఉంటే కష్టాలు ఎదురవుతాయని చెప్పాడు. కలిసొస్తుంది కదా అని చేజింగ్స్కే మొగ్గు చూపుతామంటే కుదరదని, లక్ష్యాలను నిర్దేశించడం కూడా అలవాటు చేసుకోవాలని అభిప్రాయపడ్డాడు. పంజాబ్ కింగ్స్తో మంగళవారం ఏకపక్షంగా సాగిన మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ 8 వికెట్ల తేడాతో ఘోర పరాజయాన్ని చవిచూసింది.ఈ మ్యాచ్ అనంతరం తమ ఓటమిపై స్పందించిన హార్దిక్.. సరైన లక్ష్యాన్ని నిర్దేశించడంలో తాము విఫలమయ్యామని చెప్పాడు.
'మేం కావాల్సిన లక్ష్యాన్ని నిర్దేశించలేకపోయాం. కనీసం 170 పరుగులు చేసినా పోరాడటానికి ఆస్కారం ఉండేది. కానీ మేం వరుసగా వికెట్లు కోల్పోయి మూల్యం చెల్లించుకున్నాం. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ తీసుకోవడం ఏమాత్రం తప్పుడు నిర్ణయం కాదు. మేం మా కంఫర్ట్ జోన్(చేజింగ్ చేయడం) నుంచి బయటపడాలి. ఈ టోర్నీలో మేం అద్భుతంగా లక్ష్యాలను ఛేదించాం. అయితే ముందు ముందు లక్ష్యాలను సెట్ చేయాల్సిన పరిస్థితి కూడా రావచ్చు. అందుకే లక్ష్యాలను నిర్దేశించడం ఎలానో అలవాటు చేసుకోవాలి. కంఫర్ట్ జోన్లో నుంచి బయటపడాలనే బ్యాటింగ్ ఎంచుకున్నా. మేం విజయాలు సాధించినా మరింత మెరుగవ్వడంపై దృష్టి సారిస్తాం. ఈ రోజు మాకు కలిసి రాలేదు. తదుపరి మ్యాచ్లకు బలంగా సిద్దమవుతాం. మరో రెండు రోజుల్లోనే మేం మరో మ్యాచ్ ఆడాలి. మేం మా తప్పిదాలను సవరించుకోవాలి. ఓటములు, గెలుపులు క్రీడల్లో సహజం'అని హార్దిక్ పాండ్యా చెప్పుకొచ్చాడు.

ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 143 పరుగులు చేసింది. యువ ప్లేయర్ సాయి సుదర్శన్(50 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్తో 65 నాటౌట్) మినహా అంతా విఫలమయ్యారు. పంజాబ్ బౌలర్లలో రబడా నాలుగు వికెట్లతో చెలరేగగా.. రిషి ధావన్, అర్షదీప్ సింగ్, లియామ్ లివింగ్ స్టోన్ తలో వికెట్ తీసారు. శుభ్మన్ గిల్ రనౌట్ గుజరాత్ పతనానికి కారణమైంది.
అనంతరం లక్ష్య చేధనకు దిగిన పంజాబ్ 16వ ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి145 పరుగులు చేసి మరో 24 బంతులు మిగిలుండగానే గెలుపొందింది. శిఖర్ ధావన్(53 బంతుల్లో 8 ఫోర్లు, సిక్స్తో 62 నాటౌట్) అజేయ హాఫ్ సెంచరీతో రాణించగా.. భానుక రాజపక్స(28 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్తో 40), లియామ్ లివింగ్ స్టోన్(10 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్లతో 30 నాటౌట్) కీలక ఇన్నింగ్స్ ఆడారు. గుజరాత్ బౌలర్లలో షమీ, ఫెర్గూసన్ తలో వికెట్ తీసారు.