సౌతాఫ్రికాతో తొలి టీ20లో టీమిండియా 176 పరుగుల పోరాడే లక్ష్యాన్ని నమోదు చేసింది. టాపార్డర్, మిడిలార్డర్ కట్టకట్టుకోని విఫలమైన వేళ.. ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా(28 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్స్లతో 59 నాటౌట్) అజేయ హాఫ్ సెంచరీతో జట్టును ఆదుకున్నాడు. దాంతో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 175 పరుగులు చేసింది. సౌతాఫ్రికా బౌలర్లలో లుంగి ఎంగిడి(3/31) మూడు వికెట్లు తీయగా.. లుతో సిపమ్లా(2/38) రెండు వికెట్లు పడగొట్టాడు. డోనోవన్ ఫెర్రెరియా ఒక వికెట్ పడగొట్టాడు.
టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన భారత్కు ఆశించిన శుభారంభం దక్కలేదు. ఓపెనర్ శుభ్మన్ గిల్(4) తీవ్రంగా నిరాశపర్చాడు. మెడనొప్పి నుంచి కోలుకొని జట్టులోకి వచ్చిన శుభ్మన్ గిల్ తన పునరాగమనాన్ని ఘనంగా చాటుకోలేకపోయాడు. వచ్చి రావడంతోనే కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఫోర్, సిక్స్తో దూకుడు కనబర్చాడు. కానీ లుంగి ఎంగిడి బౌలింగ్లో క్యాచ్ ఔట్గా వెనుదిరిగాడు.

తిలక్ వర్మతో కలిసి అభిషేక్ శర్మ బౌండరీలతో జోరు కనబర్చాడు. తిలక్ కాస్త నిదానంగా ఆడటంతో పవర్ ప్లేలో భారత్ 2 వికెట్లకు 40 పరుగులే చేసింది. ఆ మరుసటి ఓవర్లోనే అభిషేక్ శర్మ(17) మార్కో యాన్సెన్ స్టన్నింగ్ క్యాచ్కు వెనుదిరిగాడు. అక్షర్ పటేల్ సాయంతో తిలక్ వర్మ ఆచితూచి ఆడుతూ జట్టును ముందుకు నడిపించే ప్రయత్నం చేశాడు. కానీ తిలక్ వర్మను ఎంగిడి ఔట్ చేయడంతో భారత్ 78 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయింది.
క్రీజులోకి వచ్చిన హార్దిక్ పాండ్యా దూకుడుగా ఆడగా.. అక్షర్ పటేల్ ఆచితూచి ఆడాడు. అయితే సిపమ్లా బౌలింగ్లో క్యాచ్ ఔట్గా వెనుదిరిగాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన శివమ్ దూబే(11) కూడా తీవ్రంగా నిరాశపర్చాడు. ఓవైపు వికెట్లు పడుతున్నా.. మరోవైపు హార్దిక్ పాండ్యా దూకుడుగా ఆడాడు. జితేష్ శర్మతో కలిసి స్కోర్ బోర్డును పరుగెత్తించాడు. 25 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్స్లతో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. హార్దిక్ సూపర్ బ్యాటింగ్తో టీమిండియా 176 పరుగుల పోరాడే లక్ష్యాన్ని నమోదు చేసింది.