ఫ్లోరిడా: వెస్టిండీస్తో నాలుగో టీ20లో టీమిండియా ఎలాంటి మార్పులు లేకుండా బరిలోకి దిగింది. విన్నింగ్ కాంబినేషన్నే కొనసాగిస్తున్నామని టీమిండియా కెప్టెన్ హార్దిక్ పాండ్యా తెలిపాడు. సత్తా చాటేందుకు తమ ఆటగాళ్లు ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారని చెప్పాడు. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన వెస్టిండీస్ బ్యాటింగ్ ఎంచుకుంది.
పిచ్ కండిషన్స్ నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నానని విండీస్ సారథి రోవమన్ పోవెల్ తెలిపాడు. 'మేం ముందుగా బ్యాటింగ్ చేయాలనుకుంటున్నాం. పిచ్ కూడా బ్యాటింగ్కు అనుకూలంగా కనిపిస్తోంది. భారీ లక్ష్యాన్ని ఉంచి కాపాడుకోవాలనేది మా వ్యూహం. భారత్ వంటి పెద్ద జట్టుపై సిరీస్ గెలిచే సువర్ణవకాశం ఇది.

మా ఆటగాళ్లంతా ఈ విజయం కోసం ఉత్సాహంగా ఎందురు చూస్తున్నారు. జట్టులో కీలక మార్పులు చేశాం. జాసన్ హోల్డర్, షై హోప్, ఒడియన్ స్మిత్ జట్టులోకి రాగా జాన్సన్ చార్లెస్, రోస్టన్ చేజ్ ఉద్వాసనకు గురయ్యారు.'అని టాస్ సందర్భంగా పోవెల్ తెలిపాడు.
అనంతరం హార్దిక్ పాండ్యా మాట్లాడుతూ.. టాస్ గెలిస్తే తాము కూడా బ్యాటింగ్ తీసుకునేవాళ్లమని చెప్పాడు. 'మేం కూడా ముందుగా బ్యాటింగ్ తీసుకునేవాళ్లం. అయితే పిచ్ మారుతుందని అనుకోవడం లేదు. గత మ్యాచ్లో మా కుర్రాళ్లు అద్భుత ప్రదర్శన కనబర్చారు. అదే జోరును కొనసాగించేందుకు ఉత్సాహంగా ఉన్నారు.
మరింత కసిగా ఆడాలని వారు గ్రహించారు. ప్రతీ ఒక్కరు సత్తా చాటేందుకు రెడీగా ఉన్నారు. బౌలర్లు అద్భుత ప్రదర్శన కనబర్చగా.. తిలక్ వర్మ, సూర్య అసాధారణ బ్యాటింగ్తో మ్యాచ్ను ముగించారు. అందుకే అదే జట్టుతో మళ్లీ బరిలోకి దిగుతున్నాం. మా స్పిన్నర్లకు వికెట్లు తీసే సత్తా ఉంది. వారు తమ బౌలింగ్లో దూకుడు చూపిస్తున్నారు. పరిస్థితులను సాధారణంగా ఉంచుతూ మా ఆటలో తీవ్రత తగ్గకుండా ఆడాలనుకుంటున్నాం.'అని హార్దిక్ పాండ్యా చెప్పుకొచ్చాడు.
తుది జట్లు(అంచనా)
వెస్టిండీస్: బ్రాండన్ కింగ్, కైల్ మేయర్స్, షైహోప్, నికోలస్ పూరన్(కీపర్), రోవ్మన్ పోవెల్, షిమ్రాన్ హెట్మైర్, జాసన్ హోల్డర్, రోమారియో షెఫెర్డ్, ఒడియన్ స్మిత్, అకీల్ హోస్సెన్, ఒబెడ్ మెక్కాయ్.
భారత్: యశస్వి జైస్వాల్, శుభ్మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా(కెప్టెన్), సంజూ శాంసన్(కీపర్), అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, అర్ష్దీప్ సింగ్, యుజ్వేంద్ర చాహల్, ముకేష్ కుమార్.