
డబ్లిన్: ఐర్లాండ్తో జరుగుతున్న రెండో టీ20లో టీమిండియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ప్రత్యర్థి ముందు భారీ లక్ష్యాన్ని ఉంచాలనే ఈ నిర్ణయం తీసుకున్నానని టీమిండియా తాత్కలిక సారథి హార్దిక్ పాండ్యా తెలిపాడు. వికెట్ సైతం బ్యాటింగ్కు అనుకూలంగా కనిపిస్తోందని, మైదానంలో ఎండ కూడా ఉండటంతో పెద్ద ఇబ్బందేమి ఉండదన్నాడు. ముందుగా బ్యాటింగ్ చేయడం వల్ల తర్వాత ఎలా బౌలింగ్ చేయాలనే విషయంపై స్పష్టత వస్తుందన్నాడు. జట్టులో మూడు మార్పులు చోటు చేసుకున్నాయని, తప్పని పరిస్థితుల్లో ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందన్నాడు.
మొకాలి గాయం కారణంగా రుతురాజ్ గైక్వాడ్ తప్పుకోగా అతని స్థానంలో సంజూ శాంసన్ బరిలోకి దిగుతున్నాడని చెప్పాడు. ఇక ఆవేశ్ ఖాన్ స్థానంలో హర్షల్ పటేల్, యుజ్వేంద్ర చాహల్ ప్లేస్లో రవి బిష్ణోయ్ ఆడుతున్నాడని చెప్పాడు. టీమ్ ప్రణాళికల్లో భాగంగానే ఈ రెండు మార్పులు చేశామని స్పష్టం చేశాడు. మరోవైపు ఐర్లాంట్ జట్టులో ఎలాంటి మార్పులు చోటు చేసుకోలేదు.
ఇక తాము టాస్ గెలిచినా ముందుగా బౌలింగ్ తీసుకునేవాళ్లమని ఐర్లాండ్ కెప్టెన్ ఆండ్రూ బాల్బిర్నీ తెలిపాడు. టీ20ల్లో చేజ్ చేయడం బాగుంటుందన్నాడు. ముందు బంతితో సత్తా చాటితే తర్వాత చేజ్ చేయడం సులవవుతుందన్నాడు. తొలి మ్యాచ్లో గెలిచిన భారత్ 1-0తో ఆధిక్యంలో నిలిచింది. ఈ మ్యాచ్ సైతం గెలిచి సిరీస్ కైవసం చేసుకోవాలనుకుంటుంది. మరోవైపు ఐర్లాండ్ మాత్రం ఈ మ్యాచ్లోనైనా కనీస పోటీనివ్వాలనే పట్టుదలతో ఉంది.
తుది జట్లు:
భారత్: ఇషాన్ కిషన్, సంజూ శాంసన్, సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా, హార్దిక్ పాండ్యా(కెప్టెన్), దినేశ్ కార్తీక్(కీపర్), అక్షర్ పటేల్, హర్షల్ పటేల్, భువనేశ్వర్ కుమార్, ఉమ్రాన్ మాలిక్, రవి బిష్ణోయ్
ఐర్లాండ్: పాల్ స్టిర్లింగ్, ఆండ్రూ బాల్నిర్నే(కెప్టెన్), గారెత్ డెలానీ, హ్యారీ టెక్టర్, లక్రాన్ టక్కర్(కీపర్), కర్టిస్ క్యాంపర్, ఆండీ మెక్బైన్, జార్జ్ డాక్రెల్, మార్క్ అడైర్, బారీ మెకార్తీ, జోషువా లిటిల్