హైదరాబాద్: టీమిండియా ఆల్ రౌండర్ హార్ధిక్ పాండ్యా ఎవరితోనూ ఫోన్లలో మాట్లాడటం లేదని తండ్రి హిమన్షు పాండ్యా వెల్లడించారు. 'కాఫీ విత్ కరణ్' టాక్ షోలో మహిళల పట్ల క్రికెటర్లు హార్దిక్ పాండ్య, కేఎల్ రాహుల్ అనుచిత వ్యాఖ్యలు చేయడంతో వీరిద్దరిపై క్రమశిక్షణ చర్యలు తీసుకున్న బీసీసీఐ.. వారిని తాత్కాలికంగా సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే.
ఖవాజా రనౌట్: ఒంటి చేత్తో స్టంప్స్ని గిరాటేసిన జడేజా (వీడియో)
దీంతో క్రికెటర్లు హార్దిక్ పాండ్యా, కేఎల్ రాహుల్ ఆస్ట్రేలియాలో జరుగుతున్న వన్డేలకు దూరమయ్యారు. ఈ ఘటనతో పాండ్య చాలా డిస్టర్బ్ అయ్యాడని, ఆస్ట్రేలియా నుంచి వచ్చిన హార్దిక్ పాండ్యా.. ఇప్పుడు ఎవరితోనూ మాట్లాడటం లేదని.. ఎక్కడికీ వెళ్లకుండా ఇంట్లోనే ఉంటున్నాడని అతని తండ్రి చెప్పుకొచ్చారు.
ఈ మేరకు ఆయన బుధవారం మీడియాతో మాట్లాడుతూ "ఆస్ట్రేలియా నుంచి వచ్చిన తర్వాత పాండ్యా కనీసం ఇంటి వెలుపలకి కూడా వెళ్లలేదు. ఎవరితోనూ ఫోన్లలో మాట్లాడటం లేదు. గుజరాత్లో పెద్ద ఎత్తున సంక్రాంతి సంబరాలు జరుగుతున్నా.. అతను తనకెంతో ఇష్టమైన గాలిపటాలని ఎగురవేసేందుకు కూడా ఇష్టపడలేదు" అని తెలిపారు.
"గత కొన్నేళ్లుగా పాండ్యా ఆట నేపథ్యంలో ఇంటికి దూరంగా ఉన్నాడు. దాంతో పండుగలు జరుపుకొనే అవకాశం రాలేదు. తాజాగా ఆ అవకాశం లభించినా.. సంబరాలు చేసుకునే మూడ్లో అతను లేడు. బీసీసీఐ సస్పెండ్ చేయడంతో బాధపడుతున్నాడు" అని పాండ్యా తండ్రి హిమన్షు పేర్కొన్నారు.
"టీవీ షోలో తాను చేసిన వ్యాఖ్యలకు చింతిస్తున్నాడు. మళ్లీ ఇలాంటి తప్పు చేయనన్నాడు. ఈ విషయం గురించి పాండ్యeతో మాట్లాడదలచుకోలేదు. అతని సోదరుడు కృనాల్ కూడా ఈ విషయంపై మౌనంగా ఉన్నాడు. బీసీసీఐ తదుపరి నిర్ణయం కోసం ఎదురుచూస్తున్నాం" అని హిమాన్షు వెల్లడించారు.