ముంబై ఇండియన్స్ సారథ్య బాధ్యతలు అందుకున్న తర్వాత ఆ జట్టు మాజీ కెప్టెన్ రోహిత్ శర్మతో మాట్లాడలేదని నూతన సారథి హార్దిక్ పాండ్యా తెలిపాడు. రోహిత్ శర్మ నుంచి తనకు కావాల్సిన సహకారం లభిస్తుందని భావిస్తున్నానని తెలిపాడు. గత 10 ఏళ్లుగా అతని సారథ్యంలో ఆడుతున్నానని, తామిద్దరి మధ్య ఎలాంటి ఇబ్బంది ఉండదని చెప్పాడు.
ఐపీఎల్ 2024 సీజన్ కోసం గుజరాత్ టైటాన్స్ కెప్టెన్గా ఉన్న హార్దిక్ పాండ్యాను ముంబై ఇండియన్స్ క్యాష్ ట్రేడ్ డీలింగ్ ద్వారా జట్టులోకి తెచ్చుకుంది. జట్టులోకి తెచ్చుకోవడమే కాకుండా.. సారథ్య బాధ్యతలను అప్పగించింది. ముంబై ఇండియన్స్ భవిష్యత్తు కోసమే ఈ నిర్ణయం తీసుకున్నామని స్పష్టం చేసింది.

ఫ్యాన్స్ ఫైరల్..
అయితే కెప్టెన్సీ మార్పు నిర్ణయంపై తీవ్ర విమర్శలు వచ్చాయి. ముఖ్యంగా రోహిత్ శర్మ అభిమానులు కెప్టెన్సీ మార్పును జీర్ణించుకోలేకపోతున్నారు. ఇప్పటికే ముంబై ఇండియన్స్ సోషల్ మీడియా ఖాతాలను లక్షల మంది అన్ఫాలో చేశారు. ఐపీఎల్ 2024 సీజన్ నేపథ్యంలో సోమవారం మీడియా సమావేశంలో పాల్గొన్న హార్దిక్ పాండ్యా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
ఆయనకు ఎలాంటి ఇబ్బంది లేదు..
'ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ విషయంలో రోహిత్ శర్మ నాకు అండగా ఉంటాడు. సీజన్ మొత్తం నా భుజం తట్టి ప్రోత్సహిస్తాడానుకుంటున్నా. అతని కెప్టెన్సీలో గత 10 ఏళ్లుగా ఆడుతున్నా. అతని గురించి నాకు బాగా తెలుసు. నా సారథ్యంలో ఆడేందుకు రోహిత్ శర్మకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. కెప్టెన్ అయిన తర్వాత అతనితో మాట్లాడలేదు. అతను నాన్స్టాప్గా ప్రయాణిస్తూనే ఉన్నాడు.
ప్రపంచకప్లో నాకు విచిత్రమైన గాయం అయ్యింది. సెమీస్, ఫైనల్ వరకు పూర్తిగా కోలుకోవాలని నేను బాగా ప్రయత్నించాను. కానీ గాయం మరింత పెద్దది అయ్యింది. ప్రస్తుతం నేను పూర్తిగా కోలుకున్నాను. పూర్తి ఫిట్నెస్తో ఉన్నాను. అన్నీ మ్యాచ్లు ఆడాలనుకుంటున్నాను. ఏం జరిగినా ప్రతీ ఐపీఎల్ మ్యాచ్ బరిలోకి దిగాలనే పట్టుదలతో ఉన్నాను.
విధానాన్ని నమ్ముతున్నాం..
ముంబై ఇండియన్స్పై ఎప్పుడూ అంచనాలు ఉంటాయి. అయితే నేను మా విధానాన్ని నమ్ముతున్నాను. రేపు ఉదయమే నేను ఐపీఎల్ గెలవలేను. ఇది రెండు నెలల సుదీర్ఘ ప్రయాణం. మేం ఎలా ప్రిపేర్ అవుతాం..? ఒకరికొకరు ఎలా అండగా నిలుస్తామనేదానిపైనే జట్టు విజయవకాశాలు ఆధారపడి ఉన్నాయి.
ఫలితాలు మా చేతుల్లో లేనివి. కానీ బ్రాండ్ ఆఫ్ క్రికెట్ అడేందుకు మా సాయశక్తులా ప్రయత్నిస్తాం. ఈ సీజన్ కోసం ఆసక్తికగా ఎదురు చూస్తున్నాం. లసిత్ మలింగా, కీరన్ పోలార్డ్లతో నేను రీ యూనియన్ అవ్వడం చాలా సంతోషంగా ఉంది. ఈ ఇద్దరితో కలిసి పనిచేయడం కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను. వారితో ఆడినన్ని రోజులు చాలా ఆస్వాదించాను. ఈ ఇద్దరిలో ఒకరు బౌలింగ్ కోచ్గా మరొకరు బ్యాటింగ్ కోచ్గా పనిచేస్తుండటం ఆసక్తికరంగా ఉంది.
ఫినిషర్గా బరిలోకి దిగుతున్నా..
ఈ సీజన్లో నేను ఆల్రౌండర్గా.. ఫినిషర్గా బరిలోకి దిగుతున్నాను. సాధ్యమైనంత వరకు మ్యాచ్లను ముగించడంపై ఫోకస్ పెట్టాను. జస్ప్రీత్ బుమ్రా నెంబర్ 1 బౌలర్. ఛాంపియన్ క్రికెటర్. గతేడాది ముంబై ఇండియన్స్ అతని సేవలను కోల్పోయింది. అతను కూడా ఈ జట్టులో ఓ నాయకుడే.'అని హార్దిక్ పాండ్యా చెప్పుకొచ్చాడు.
మార్చి 22 నుంచి ఐపీఎల్ 2024 సీజన్ ప్రారంభం కానుండగా.. 24న అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటాన్స్తో జరిగే మ్యాచ్తో ముంబై ఇండియన్స్ తమ క్యాంపైన్ను ప్రారంభించనుంది.