T20 World Cup 2022: ఆదుకున్న కోహ్లీ.. దంచికొట్టిన హార్దిక్... ఇంగ్లండ్ ముందు పోరాడే లక్ష్యం!

అడిలైడ్: టీ20 ప్రపంచకప్ 2022లో భాగంగా ఇంగ్లండ్తో జరుగుతున్న కీలక సెమీఫైనల్లో టీమిండియా స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా(33 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్స్లతో 63)దుమ్మురేపాడు. దాంతో టీమిండియా 169 పరుగుల పోరాడే లక్ష్యాన్ని ఇంగ్లండ్ ముందు ఉంచింది. హార్దిక్ పాండ్యాకు తోడుగా విరాట్ కోహ్లీ(40 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్తో 50) హాఫ్ సెంచరీతో రాణించడంతో ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 168 పరుగులు చేసింది. ఇంగ్లండ్ బౌలర్లలో క్రిస్ జోర్డాన్ మూడు వికెట్లు తీయగా.. ఆదిల్ రషీద్, క్రిస్ వోక్స్ తలో వికెట్ తీసారు.

శుభారంభం లేదు..
టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన టీమిండియాకు ఆదిలోనే గట్టి షాక్ తగిలింది. క్రిస్ వోక్స్ వేసిన రెండో ఓవర్లోనే రాహుల్(5) క్యాచ్ ఔటయ్యాడు.ఈ ఓవర్ నాలుగో బంతిని ఔట్ సైడ్ ఆఫ్ స్టంప్ బాల్గా వేయగా.. రాహుల్ షాట్ ఆడే ప్రయత్నం చేశాడు. కానీ సరైన ఫుట్ వర్క్ లేకపోవడంతో పాటు బంతిని అంచనా వేయడంలో విఫలమైన రాహుల్ మూల్యం చెల్లించుకున్నాడు. దాంతో ఈ మ్యాచ్లోనూ టీమిండియాకు సరైన శుభారంభం అందలేదు. 9 పరుగులకే తొలి వికెట్ కోల్పోయింది. ఈ పరిస్థితుల్లో క్రీజులోకి వచ్చిన విరాట్ కోహ్లీతో కలిసి రోహిత్ శర్మ ఇన్నింగ్స్ను ముందుకు నడిపించారు.

నిదానంగా ఆడిన రోహిత్..
ఆరంభంలోనే వికెట్ కోల్పోవడంతో రోహిత్, కోహ్లీ ఆత్మరక్షణలో ఆడారు. కోహ్లీ ఓ సిక్సర్ బాదగా.. రోహిత్ రెండు బౌండరీలు బాదడంతో పవర్ ప్లేలో టీమిండియా వికెట్ నష్టానికి 38 పరుగులు మాత్రమే చేసింది. పవర్ ప్లే అనంతరం జోస్ బట్లర్ స్పిన్నర్లను రంగంలోకి దించగా.. పరుగులు చేసేందుకు భారత బ్యాటర్లు తడబడ్డారు. దాంతో ఒత్తిడికి లోనైన రోహిత్ క్రిస్ జోర్డాన్ వేసిన 9వ ఓవర్లో భారీ షాట్ ఆడే ప్రయత్నంలో క్యాచ్ ఔటయ్యాడు. క్రీజులోకి వచ్చిన సూర్య బెన్ స్టోక్స్ వేసిన 11వ ఓవర్లో వరుసుగా సిక్స్, ఫోర్ బాది జోరు కనబర్చాడు. కానీ ఆదిల్ రషీద్ మరుసటి ఓవర్లో క్యాచ్ ఔట్గా పెవిలియన్ చేర్చి కోలుకోలేని దెబ్బతీసాడు.

కోహ్లీ హాఫ్ సెంచరీ..
క్రీజులోకి వచ్చిన హార్దిక్ పాండ్యా పూర్తిగా డిఫెన్స్కు పరిమితమవ్వడంతో జట్టు స్కోర్ నెమ్మదించింది. అయితే 13వ ఓవర్ నుంచి ఓవర్కు ఓ బౌండరీ బాదిన ఈ జోడి జట్టును భారీ స్కోర్ దిశగా తీసుకెళ్లారు. జోర్డాన్ వేసిన 18వ ఓవర్లో హార్దిక్ పాండ్యా వరుసగా రెండు సిక్స్లు బాదగా.. కోహ్లీ క్విక్ డబుల్తో 39 బంతుల్లో హాఫ్ సెంచరీ మార్క్ అందుకున్నాడు. కానీ చివరి బంతికి విరాట్ ... ఆదిల్ రషీద్ సూపర్ క్యాచ్కు వెనుదిరిగాడు.

దంచికొట్టిన హార్దిక్...
సామ్ కరన్ వేసిన 19వ ఓవర్లో రిషభ్ పంత్ ఓ బౌండరీ బాదగా.. హార్దిక్ 4, 6,4, 4 కొట్టి 28 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. దాంతో ఈ ఓవర్లొ 20 పరుగులు వచ్చాయి. జోర్డాన్ వేసిన ఆఖరి ఓవర్లో తొలి రెండు బంతుల్లో సింగిల్సే రాగా.. మూడో బంతికి పంత్ రనౌటయ్యాడు. నాలుగో బంతిని సిక్స్ బాదిన హార్దిక్ పాండ్యా.. ఆఖరి రెండు బంతులను బౌండరీలకు తరలించినా.. ఆఖరి బంతికి హిట్ వికెట్ అవ్వడంతో టీమిండియా 168 పరుగులకే పరిమితమైంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications