ముంబై: వెన్ను గాయంతో సుదీర్ఘ కాలం విశ్రాంతి తీసుకున్న టీమిండియా ఆల్రౌండర్ పాండ్యా పునరాగమన ప్రయత్నాలు చేస్తున్నాడు. శస్త్ర చికిత్ర కారణంగా సుమారు 6 నెలల పాటు ఆటకు దూరమైన ఈ బరోడా బ్యాట్స్మన్.. నేషనల్ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ)లో ఫిట్నెస్ కోసం పరితపిస్తున్నాడు. ఈ క్రమంలో బరిలోకి దిగిన తొలి మ్యాచ్లోనే సిక్సర్ల మోత మోగించాడు. తద్వార ఐపీఎల్కు తాను రెడీ అన్నట్లు ప్రత్యర్థులకు హెచ్చరికలు జారీ చేశాడు.
డీవై పాటిల్ టీ20 కప్లో భాగంగా రిలయన్స్-1 జట్టు తరఫున బరిలోకి దిగిన పాండ్యా తన సహజ సిద్ధమైన ఆటతో అలరించాడు. 25 బంతుల్లో ఒక ఫోర్, నాలుగు సిక్స్లతో 38 పరుగులు చేశాడు. బౌలింగ్లోను 3 వికెట్లు తీసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. బ్యాంక్ ఆఫ్ బరోడాతో జరిగిన ఈ మ్యాచ్లో హార్దిక్ తొలుత నిదానంగా ఆడాడు. తొలి 12 బంతులకు 7 పరుగులు మాత్రమే చేసిన ఈ బరోడా ప్లేయర్.. అనంతరం ఆకాశమే హద్దుగా చెలరేగాడు.
అయితే ఈ మ్యాచ్లో ఊహించని విధంగా హార్దిక్ వివాదంలో చిక్కుకున్నాడు. బీసీసీఐ నిబంధనల ప్రకారం దేశవాళీ మ్యాచ్ల్లో ఆడేటప్పుడు, టీమిండియాకు సంబంధించిన వస్తువులు వాడకుడదు. అయితే ఈ మ్యాచ్లో పాండ్యా.. టీమిండియా లోగోతో ఉన్న హెల్మెట్ ధరించి బరిలోకి దిగాడు. అవగాహన లేకనే ఇలా బరిలోకి దిగినట్లు అతని సన్నిహితులు తెలిపారు.