గత 50 రోజులుగా కుటుంబానికి దూరంగా ఉంటూ ఎన్సీఏలో పడ్డ కష్టానికి ఫలితం దక్కిందని టీమిండియా స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా సంతోషం వ్యక్తం చేశాడు. ఐదు టీ20ల సిరీస్లో భాగంగా మంగళవారం కటక్ వేదికగా జరిగిన తొలి మ్యాచ్లో భారత్ 101 పరుగుల భారీ తేడాతో సౌతాఫ్రికాను చిత్తు చేసింది.
176 పరుగుల లక్ష్య ఛేదనలో సౌతాఫ్రికా 74 పరుగులకే కుప్పకూలి ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. ఈ మ్యాచ్లో హార్దిక్ పాండ్యా ఆల్రౌండ్ ప్రదర్శనతో టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్ అందుకున్నాడు.
ఈ సందర్భంగా మాట్లాడిన హార్దిక్ పాండ్యా.. తాను దేశం కోసమే ఆడుతానని, అదే తన బలమని చెప్పుకొచ్చాడు. 'నా షాట్లను నేను నమ్మకున్నాను. వికెట్ కాస్త స్పైసీగా ఉందని గ్రహించాను. దాంతో కాస్త ధైర్యంగా ఆడాల్సి వచ్చింది. బంతిని బలంగా బాదడం కంటే టైమింగ్పైనే ఎక్కువ ఫోకస్ పెట్టాను. నా బ్యాటింగ్ పట్ల చాలా సంతృప్తిగా ఉన్నాను. దీని వెనుక చాలా కష్టం ఉంది. దాన్ని హైలైట్ చేయాలనుకోవడం లేదు.

గత 50 రోజులుగా కుటుంబానికి దూరంగా ఉంటూ ఎన్సీఏలో తీవ్రంగా కష్టపడ్డాను. ఆ శ్రమకు తగిన ఫలితం దక్కడం సంతోషంగా ఉంది. జట్టులో నా పాత్ర గురించి ఎప్పుడూ పెద్దగా ఆలోచించను. నాకు జట్టు, దేశ ప్రయోజనాలే ముఖ్యం. నేను ఇతర జట్లకు ఆడినా.. దేశం తరఫున ఆడటమే నాకు ముఖ్యం. ఇదే నా అతిపెద్ద బలం. అవకాశం వచ్చినప్పుడల్లా నా వంతు కృషి చేసేందుకు ప్రయత్నిస్తాను. ఆటగాడిగా కొన్ని రోజులు బాగుంటాయి.
మరికొన్ని రోజులు బాగుండవు. కానీ జట్టు గెలుపు కోసం ఆడాలనే ఆలోచన నాకు ఎప్పుడూ సహాయపడుతుంది. కేశవ్ మహరాజ్ను లక్ష్యంగా చేసుకోని ఆడటం మంచి ఫలితాన్ని ఇచ్చింది. మహారాజ్ నా ఆర్క్లో బౌలింగ్ చేయడంతో భారీ షాట్లు ఆడాను. ఆ ఓవర్ మాకు మూమెంటమ్ను అందించింది.'అని హార్దిక్ పాండ్యా చెప్పుకొచ్చాడు.