
ముంబై: తన వద్ద ఉన్న అత్యంత ఖరీదైన వాచ్లను ముంబై కస్టమ్స్ అధికారులు సీజ్ చేశారంటూ వస్తున్న వార్తలపై టీమిండియా ఆల్రౌండర్ హార్టిక్ పాండ్యా ఆగ్రహం వ్యక్తం చేశాడు. టీ20 ప్రపంచకప్ 2021 నుంచి టీమిండియా నిష్క్రమించిన అనంతరం కుటుంబంతో అక్కడే ఉన్న హార్దిక్.. సోమవారం స్వదేశం చేరాడు. అయితే అతని వద్ద ఉన్న రూ.5 కోట్ల రిస్ట్ వాచ్లను కస్టమ్స్ అధికారులను స్వాధీనం చేసుకున్నారని జాతీయ మీడియాలో ప్రచారం జరిగింది. ఎయిర్పోర్టులో తనిఖీల సందర్భంగా సరైన బిల్స్ లేని వాచ్లను గుర్తించిన అధికారులు వాటిని సీజ్ చేశారని ఏబీపీ న్యూస్ పేర్కొంది.
అయితే ఈ వార్త కథనాలతో అవాక్కైన హార్దిక్ పాండ్యా వీటిని ఖండిస్తూ ట్విటర్ వేదికగా ఓ ప్రకటనను విడుదల చేశాడు. తన వస్తువులను అధికారులు స్వాదీనం చేసుకోలేదని, తానే స్వయంగా వారి ముందు ఉంచి ఏమైనా కస్టమ్స్ డ్యూటీ పే చేయాల్సి అవసరం ఉందా? అని ప్రశ్నించి వారిని తనిఖీ చేయమని కోరానన్నాడు. కానీ సోషల్ మీడియాలో తప్పుగా ప్రచారం జరుగుతుందని అందుకే వివరణ ఇస్తున్నానని తెలిపాడు. తాను కొన్న అన్నీ వస్తువులకు సంబంధించిన బిల్స్, డ్యాకుమెంట్స్ కస్టమ్స్ అధికారులకు అందజేశానన్నాడు. ఇంకేమైనా కస్టమ్ డ్యూటీస్ పే చేయాలంటే కట్టడానికి తాను సిద్దమేనని, అది పెద్ద విషయమేమి కాదన్నాడు.
ఇక సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్నట్లు ఆ వాచ్ ధర రూ.5 కోట్లు కాదని, కోటిన్నరేనని పాండ్యా క్లారిటీ ఇచ్చాడు. తాను దేశ చట్టాలు, న్యాయ సూత్రాలను గౌరవించే పౌరుడునని, ప్రభుత్వ ఏజెన్సీల పట్ల తనకు అపారమైన గౌరవం ఉందని తెలిపాడు. ముంబై కస్టమ్స్ అధికారులు సైతం తనకు అన్ని విధాలుగా సహకరించారని, వారికి కావాల్సిన డాక్యూమెంట్స్ అందేజేశానన్నాడు. సోషల్ మీడియా వేదికగా తనకు వ్యతిరేకంగా జరుగుతున్న ప్రచారం పూర్తిగా అవాస్తవమని స్పష్టం చేశాడు.
హార్దిక్ పాండ్యా వద్ద అత్యంత ఖరీదైన, ప్రసిద్ధ కంపెనీలకు చెందిన వాచ్ కలెక్షన్ ఉంది. వీటిలో పటేక్ ఫిలిఫ్ నాటిలస్ ప్లాటినమ్ 5711 ప్రముఖమైంది. జీక్యూ ఇండియా రిపోర్టు ప్రకారం... ఈ వాచ్ మొత్తం ప్లాటినమ్తో రూపొందించబడింది. 32 బాగెట్ కట్ ఎమరాల్డ్స్ పొదిగి ఉంటాయి. ఇంటిగ్రేటెడ్ బ్రాస్లెట్ కూడా ఉంటుంది. అంతేకాదు కస్టమర్లు కోరిన విధంగా వారికిష్టమైన రీతిలో వాచ్ను తయారు చేసి ఇస్తారు. ఇక ఐపీఎల్ 2021 సెకండాఫ్ ప్రారంభానికి ముందు హార్దిక్ పాండ్యా ఈ వాచీని ధరించిన ఫొటోలను ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసిన సంగతి తెలిసిందే.
గతంలో హార్దిక్ పాండ్యా సోదరుడు కృనాల్ పాండ్యా సైతం ముంబై కస్టమ్స్ అధికారులకు అడ్డంగా దొరికిపోయాడు. గతేడాది ఐపీఎల్ ముగిసిన తర్వాత ఖరీదైన బంగారు నగలతో స్వదేశం చేరిన కృనాల్ను తనిఖీ చేయగా డ్యాకుమెంట్స్ సరిగ్గా లేని బంగారు ఆభరణాలు దొరికాయి. వాటిని సద్వినియోగం చేసుకోగా.. కస్టమ్స్ చెల్లించి కృనాల్ తీసుకెళ్లాడు. అవగాహన లేకుండానే ఈ తప్పిదం చేశానని క్షమాపణలు కోరాడు.