టీమిండియా స్టార్ ఆల్రౌండర్, ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా.. సన్రైజర్స్ హైదరాబాద్ తరఫున ఐపీఎల్లోకి అరంగేట్రం చేయాల్సిందని మాజీ ఆల్రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ తెలిపాడు. ఐపీఎల్ 2012కి ముందు హార్దిక్ పాండ్యా గురించి అప్పటి సన్రైజర్స్ హైదరాబాద్ మెంటార్ వీవీఎస్ లక్ష్మణ్కు చెప్పానని, కానీ అతను పట్టించుకోలేదన్నాడు. లక్ష్మణ్ తన మాట విని హార్దిక్ పాండ్యాకు అవకాశం ఇచ్చి ఉంటే హార్దిక్ పాండ్యా సన్రైజర్స్ హైదరాబాద్లోనే కొనసాగేవాడని తెలిపాడు.
ఐపీఎల్ 2025 సీజన్ కామెంట్రీ ప్యానెల్ నుంచి ఇర్ఫాన్ పఠాన్ను బీసీసీఐ తప్పించిన విషయం తెలిసిందే. స్టార్ క్రికెటర్లపై అనుచిత వ్యాఖ్యలు చేయడంతోనే ఇర్ఫాన్ పఠాన్పై వేటు పడినట్లు వార్తలు వచ్చాయి. ముఖ్యంగా రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలను విమర్శించడంతోనే ఇర్ఫాన్ పఠాన్పై వేటు పడిందని ప్రచారం జరిగింది. కానీ హార్దిక్ పాండ్యా ఫిర్యాదుతోనే తనను కామెంట్రీ ప్యానెల్ నుంచి తొలిగించారని ఓ పాడ్ కాస్ట్ ఇంటర్వ్యూలో పఠాన్ స్పష్టం చేశాడు. తనకు హార్దిక్ పాండ్యాకు ఎలాంటి గొడవలు లేవని, కెరీర్ ప్రారంభంలో అతనికి చాలా అండగా నిలిచానని చెప్పాడు.

'క్రికెట్ వ్యాఖ్యాతగా విమర్శించడం మా పని. బాగా ఆడితే కొనియాడటం.. ఆడకపోతే విమర్శించడం కామెంటేటర్లుగా మా బాధ్యత. హార్దిక్ పాండ్యాతో నాకు ఎలాంటి గొడవలు లేవు. నా తర్వాత బరోడా నుంచి వచ్చిన ఆటగాళ్లందరికి మేం అండగా నిలిచాం. దీపక్ హుడా, కృనాల్ పాండ్యా, హార్దిక్ పాండ్యాల్లో ఎవరూ కూడా ఇర్ఫాన్ పఠాన్, యూసఫ్ పఠాన్ మాకు సాయం చేయలేదని చెప్పలేదు.
2012లో హార్దిక్ పాండ్యా గురించి సన్రైజర్స్ మెంటార్గా ఉన్న వీవీఎస్ లక్ష్మణ్కు చెప్పాను. కానీ ఆయన నా మాట పట్టించుకోలేదు. దాంతో 2012లో హార్దిక్ పాండ్యా అన్సోల్డ్గా నిలిచాడు. నేను చెప్పిన మాట లక్ష్మణ్ విని ఉంటే హార్దిక్ పాండ్యా సన్రైజర్స్ హైదరాబాద్కు ఆడేవాడు.
హార్దిక్ పాండ్యా ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టినప్పుడు అతనికి నేను అండగా నిలిచాను. ముంబై అభిమానుల నుంచి వచ్చిన విమర్శలను తిప్పికొట్టాను. ఇక ఆటగాళ్లను కామెంటేటర్లు విమర్శించడం పెద్ద తప్పే కాదు. ప్రతీ ఆటగాడు విమర్శలు ఎదుర్కొనేవాళ్లే. సునీల్ గవాస్కర్, సచిన్ టెండూల్కర్లు కూడా విమర్శలను ఎదుర్కొన్నవారే. కానీ కెప్టెన్సీ విషయంలో హార్దిక్ పాండ్యాపై విమర్శలు సరైనవి కావు.'అని ఇర్ఫాన్ పఠాన్ చెప్పుకొచ్చాడు.