టీ20 ప్రంచకప్ గెలిచిన టీమిండియాకు ముంబై అభిమానులు ఘన స్వాగతం పలికారు. ప్రపంచకప్తో గురువారం తెల్లవారుజామున స్వదేశానికి చేరిన టీమిండియా ఆటగాళ్లు.. ముందుగా దేశప్రధాని నరేంద్ర మోదీని కలిసారు. ఆయనతో కలిసి బ్రేక్ఫాస్ట్ చేశారు. టీమిండియా ప్రపంచకప్ విజయాన్ని ఉద్దేశిస్తూ బీసీసీఐ ముంబైలో జైత్రయాత్రను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.
వర్షం కారణంగా ఈ జైత్రయాత్ర కాస్త ఆలస్యం కాగా.. అభిమానులు భారీ సంఖ్యలో హాజరయ్యారు. ప్రపంచకప్ సాధించిన రోహిత్ సేనను చూసేందుకు అభిమానులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. దాంతో ముంబైలోని రోడ్లన్నీ కిక్కిరిసిపోయాయి. మెట్రో, బస్, రైల్వే స్టేషన్లు అభిమానులతో నిండిపోయాయి.

వాంఖడే స్టేడియానికి వెళ్లే రోడ్లన్నీ బ్లాక్ అయ్యాయి. విపరీతమైన ట్రాఫిక్ జామ్ కారణంగా భారత ఆటగాళ్లు కోసం ఏర్పాటు చేసిన ఓపెన్ టాప్ బస్ కూడా ముందుకు కదల్లేని పరిస్థితి నెలకొంది. ప్రపంచకప్ గెలిచిన ఆటగాళ్లకు బీసీసీఐ వాంఖడే స్టేడియంలో సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేసింది. దాంతో ముంబై మైదానం అభిమానులతో కిక్కిరిసిపోయింది.
ప్రస్తుతం వాంఖడే స్టేడియం హార్దిక్ పాండ్యా నామస్మరణంతో దద్దరిల్లుతోంది. రెండు నెలల క్రితం ఇదే మైదానం వేదికగా ముంబై ఇండియన్స్ సారథ్య బాధ్యతలు చేపట్టిన హార్దిక్ పాండ్యాను అభిమానులు దారుణంగా అవమానించారు. రోహిత్ శర్మను కాదని ముంబై సారథ్య బాధ్యతలు తీసుకున్నాడని గేలి చేశారు. టోర్నీ ఆసాంతం అతన్ని ఎగతాళి చేశారు. దాంతో హార్దిక్ పాండ్యా తీవ్ర మానసిక వేదనకు గురయ్యాడు.
ఐపీఎల్ 2024 సీజన్లో దారుణంగా విఫలమైనా.. ప్రపంచకప్లో అద్భుత ప్రదర్శన కనబర్చాడు. బ్యాట్తో పాటు బంతితోనూ సత్తా చాటాడు. సౌతాఫ్రికాతో జరిగిన ఫైనల్లో చివరి ఓవర్ను కట్టుదిట్టంగా వేయడంతో పాటు కీలక వికెట్లు తీసి విజయంలో కీలక పాత్ర పోషించాడు. దాంతోనే ముంబై అభిమానులు హార్దిక్ పాండ్యాకు జేజేలు పలుకుతున్నారు. ట్రోలింగ్ చేసినందుకు తమను క్షమించాలని ప్లకార్డ్స్ కూడా ప్రదర్శిస్తున్నారు. ప్రస్తుతం హార్దిక్ పాండ్యా నామస్మరణానికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది.