టీమిండియా స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా చరిత్ర సృష్టించాడు. టీ20 ప్రపంచకప్ చరిత్రలో హాఫ్ సెంచరీ నమోదు చేసిన తొలి నెంబర్ 6 టీమిండియా బ్యాటర్గా నిలిచాడు. ఈ క్రమంలో టీమిండియా దిగ్గజ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ, సురేశ్ రైనాల రికార్డులను హార్దిక్ పాండ్యా అధిగమించాడు.
టీ20 ప్రపంచకప్ 2024లో భాగంగా బంగ్లాదేశ్తో శనివారం జరిగిన సూపర్-8 మ్యాచ్లో హార్దిక్ పాండ్యా 27 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించాడు. ఈ అజేయ హాఫ్ సెంచరీతో టీ20 ప్రపంచకప్ చరిత్రలోనే హాఫ్ సెంచరీ నమోదు చేసిన తొలి నెంబర్ 6 బ్యాటర్గా హార్దిక్ పాండ్యా అరుదైన ఘనతను అందుకున్నాడు.

2007 టీ20 ప్రపంచకప్లో సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్లో మహేంద్ర సింగ్ ధోనీ ఆరో స్థానంలో బ్యాటింగ్ చేసి 33 బంతుల్లో 45 పరుగులు చేశాడు. 2012 టీ20 ప్రపంచకప్లో సౌతాఫ్రికాతోనే జరిగిన మ్యాచ్లో ఆరోస్థానంలో బ్యాటింగ్ చేసిన సురేశ్ రైనా 34 బంతుల్లో 45 పరుగులే చేసి ధోనీ రికార్డును సమం చేశాడు. తాజాగా హార్దిక్ పాండ్యా ఈ ఇద్దరిని అధిగమించడంతో పాటు హాఫ్ సెంచరీ చేసిన బ్యాటర్గానూ రికార్డ్ సాధించాడు.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 196 పరుగులు చేసింది. హార్దిక్ పాండ్యా(27 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లతో 50 నాటౌట్) విధ్వంసకర హాఫ్ సెంచరీతో చెలరేగగా.. శివమ్ దూబే(24 బంతుల్లో 3 సిక్సర్లతో 34), విరాట్ కోహ్లీ(28 బంతుల్లో ఫోర్, 3 సిక్స్లతో 37), రిషభ్ పంత్(24 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్లతో 36) మెరుపులు మెరిపించారు.
బంగ్లాదేశ్ బౌలర్లలో తంజిమ్ హసన్ షకీబ్(2/32), రిషద్ హొస్సేన్(2/43) రెండేసి వికెట్లు తీయగా.. షకీబ్ అల్ హసన్ ఓ వికెట్ తీసాడు. రిషభ్ పంత్ ఔటైన అనంతరం క్రీజులోకి వచ్చిన హార్దిక్ పాండ్యా.. శివమ్ దూబేతో కలిసి ఐదో వికెట్కు 53 పరుగులు జోడించాడు. అక్షర్ పటేల్తో కలిసి ఆరో వికెట్కు అజేయంగా 35 పరుగుల భాగస్వామ్యం అందించాడు. ఇందులో అక్షర్ పటేల్ 3 పరుగులే చేయగా.. హార్దిక్ 32 రన్స్ చేయడం విశేషం.