తన ఆటకు దిష్టి తగలవద్దని టీమిండియా స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా అన్నాడు. ప్రస్తుతం తాను సూపర్ ఫామ్లో ఉన్నానని, బ్యాటింగ్, బౌలింగ్లో మంచి టచ్లో కనిపిస్తున్నానని తెలిపాడు. ఆటను ఆస్వాదిస్తున్నానని చెప్పిన హార్దిక్ పాండ్యా.. ఐసీసీ టీ20 ప్రపంచకప్ కోసం ఆర్మీ తరహా ట్రైనింగ్ తీసుకున్నట్లు వెల్లడించాడు.
గ్రూప్-ఏలో భాగంగా న్యూఢిల్లీ వేదికగా గురువారం జరిగిన మ్యాచ్లో సమష్టిగా రాణించిన టీమిండియా 93 పరుగుల తేడాతో నమీబియాను చిత్తు చేసింది. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ హార్దిక్ పాండ్యా(52, 2/21) ఆల్రౌండ్షోతో టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ సందర్భంగా మాట్లాడిన హార్దిక్ పాండ్యా.. పిచ్ బ్యాటింగ్కు కఠినంగా ఉందని చెప్పాడు.
'నేను నా ఆటను ఆస్వాదిస్తున్నాను. ఈ టోర్నీ కోసం గత రెండు నెలలు తీవ్రంగా కష్టపడ్డాను. నా ఆటకు దిష్టి తగలకూడదు. అంతా సవ్యంగా సాగుతోంది. నేను ఎప్పుడూ ఒక బ్యాటర్గా గర్వపడుతుంటాను. నా ఆట తీరు క్లిక్ అయినప్పుడు.. కేక్పై ఉండే అదనపు తీపి లాంటి అనుభూతి కలుగుతోంది. ప్రస్తుతం నా శరీరం బాగా సహకరిస్తోంది. ఇందుకోసం నేను చాలా కష్టపడ్డాను. ఫిట్నెస్ కోసం పడే శ్రమను ఇష్టపడుతాను.

దేశం కోసం ఆడటమే నా తొలి ప్రాధాన్యత. టోర్నీకి నెల రోజుల ముందే నేను ఆర్మీ తరహా శిక్షణా శిబిరంలో పాల్గొంటాను. మాకు చాలా ఆప్షన్లు ఉన్నాయి. పేసర్లు, స్పిన్నర్ల విభాగం పటిష్టంగా ఉంది. వరుణ్, అక్షర్, కుల్దీప్ యాదవ్ కూడా అద్భుతమైన ప్రదర్శన చేశారు. వరుసగా ఈ రెండు పిచ్లు బ్యాటింగ్కు అనుకూలంగా లేవు. ఈ రోజు వికెట్పై బంతి ఆగుతూ వచ్చింది. మనం కేవలం పరిస్థితులకు అనుగుణంగా మారి నైపుణ్యంతో రాణించాలి. రాబోయే మ్యాచ్లకు మరికొంత ఫ్లాట్ వికెట్లు ఉండాలని కోరుకుంటున్నాం.'అని హార్దిక్ పాండ్యా చెప్పుకొచ్చాడు.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 209 పరుగులు చేసింది. ఇషాన్ కిషన్(24 బంతుల్లో 6 ఫోర్లు, 5 సిక్స్లతో 61), హార్దిక్ పాండ్యా(27 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్లతో 52) హాఫ్ సెంచరీలతో రాణించారు. నమీబియా కెప్టెన్ ఎరాస్మస్(4/20) నాలుగు వికెట్లు తీయగా.. బెన్ షికోంగో, జేజే స్మిత్, బెర్నార్డ్ స్కాల్ట్జ్ తలో వికెట్ తీసారు
అనంతరం నమీబియా 18.2 ఓవర్లలో 116 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్లు స్టీన్ కాంప్(29), జాన్ ఫ్రిలింక్(22) టాప్ స్కోరర్లుగా నిలిచారు. భారత బౌలర్లలో వరుణ్ చక్రవర్తీ(3/7) మూడు వికెట్లు తీయగా.. హార్దిక్ పాండ్యా(2/21), అక్షర్ పటేల్(2/20) రెండేసి వికెట్లు పడగొట్టారు. భారత స్పిన్నర్ వరుణ్ చక్రవర్తీ ధాటికి ఐర్లాండ్ బ్యాటర్లు తేలిపోయారు.