టీమిండియా స్టార్ ప్లేయర్, ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా కేంద్ర హోం మంత్రి అమిత్షాతో కలిసి ఓ కార్యక్రమంలో పాల్గొనడం చర్చనీయాంశమైంది. ఈ కార్యక్రమానికి బీసీసీఐ సెక్రటరీ జై షా కూడా హాజరయ్యారు. ఈ ముగ్గురూ కలిసి గాంధీనగర్ లోక్ సభ ప్రీమియర్ లీగ్(జీఎల్పీఎల్)ను ప్రారంభించారు.
ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు దేశవ్యాప్తంగా 'పార్లమెంటేరియన్ స్పోర్ట్స్ కాంపిటీషన్' అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా గాంధీనగర్ లోక్సభ ప్రీమియర్ లీగ్ను మంగళవారం ప్రారంభించారు. గాంధీనగర్ పార్లెమెంట్ పరిధిలోనే ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లకు చెందిన జట్లు ఈ టోర్నీలో పాల్గొంటాయి.

గుజరాత్ ప్రభుత్వం ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ మెగా టోర్నీకి హార్దిక్ పాండ్యా బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలోనే అమిత్ షా, జైషాతో కలిసి ఈ టోర్నీని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన ఫొటోలు వీడియోలు నెట్టింట వైరల్గా మారాయి.
వన్డే ప్రపంచకప్లో చీలమండ గాయంతో భారత జట్టుకు దూరమైన హార్దిక్ పాండ్యా.. మైదానంలోకి రీఎంట్రీ ఇచ్చేందుకు శ్రమిస్తున్నాడు. గుజరాత్ టైటాన్స్ నుంచి క్యాష్ ట్రేడింగ్ ద్వారా ముంబై ఇండియన్స్లోకి వెళ్లిన హార్దిక్ పాండ్యాకు ఆ జట్టు సారథ్య బాధ్యతలు దక్కాయి. రోహిత్ శర్మను కాదని హార్దిక్ పాండ్యాకు సారథ్య బాధ్యతలు ఇవ్వడంపై సోషల్ మీడియా వేదికగా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
రోహిత్ ఫ్యాన్స్.. హార్దిక్ పాండ్యాను టార్గెట్ చేస్తూ ట్రోల్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే అతను దేశంలోనే పవర్ఫుల్ మ్యాన్ అయిన అమిత్ షాతో కనిపించడంతో నెటిజన్లు షాక్ అవుతున్నారు. భారత క్రికెట్లో హార్దిక్ పాండ్యా కూడా పవర్ ఫుల్ మ్యాన్ అయ్యాడని అభిప్రాయపడుతున్నారు. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ తర్వాత హార్దిక్ పాండ్యా భారత క్రికెట్నే ఏలేందుకు సిద్దమయ్యాడని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు.
ఐపీఎల్ 2024 సీజన్తో హార్దిక్ పాండ్యా మళ్లీ మైదానంలోకి అడుగుపెట్టనున్నాడు. పూర్తి ఫిట్నెస్ సాధించేందుకు జిమ్లో తెగ కష్టపడుతున్నాడు.