
న్యూఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) 2020 సీజన్ ప్రారంభానికి ఇంకా 19 రోజుల గడువే ఉండగా.. చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు దెబ్బ మీద దెబ్బ తగలుతుంది. ఇప్పటికే ఆ జట్టులో ఇద్దరు ఆటగాళ్లు, 11 మంది సహాయక సిబ్బంది కరోనా బారిన పడగా.. స్టార్ ప్లేయర్ సురేశ్ రైనా లీగ్ నుంచి తప్పుకున్నాడు. అయితే తాజాగా ఆ జట్టు వెటరన్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ కూడా దూరమయ్యే అవకాశాలున్నాయని తెలుస్తోంది.
ప్రస్తుతం భారత్లో ఉన్న హర్భజన్ తన తల్లి అనారోగ్యం కారణంగా జట్టుతో దుబాయ్కు వెళ్లలేదు. చెన్నై వేదికగా నిర్వహించిన ప్రాక్టీస్ క్యాంప్లో కూడా పాల్గొనలేదు. అయితే జట్టు షెడ్యూల్ ప్రకారం అతను మంగళవారం యూఏఈలో అడుగుపెట్టాల్సింది. కానీ జట్టులో చోటు చేసుకున్న పరిణామాలు, రైనా లీగ్కు దూరమైన నేపథ్యంలో జట్టు ఓనర్ ఎన్ శ్రీనివాసన్ చేసిన వ్యాఖ్యలతో భజ్జీ పునరాలోచనలో పడ్డాడంట. ఈ సీజన్ను వదిలేయాలని కూడా అనుకుంటున్నాడట.

'హర్భజన్ మంగళవారం జట్టుతో కలవాల్సి ఉంది. కానీ చెన్నై జట్టులో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా అతను తీవ్ర ఆందోళనకు గురువుతున్నాడు. షెడ్యూల్ను మార్చుకొని ఆలస్యంగా వెళ్లాలని లేకుంటే ఈ సీజన్ ఐపీఎల్నే స్కిప్ చేయాలనుకుంటున్నాడు.'అని భజ్జీ సన్నిహితుడొకరు తెలుపాడని ఇన్సైడ్ స్పోర్ట్స్ పేర్కొంది. అయితే ఈ రిపోర్ట్స్పై భజ్జీ వివరణ కోరగా అతని నుంచి ఎలాంటి స్పందన రాలేదని తెలిపింది.
ఇక భజ్జీ కూడా దూరమైతే సీఎస్కే తీవ్ర కష్టాలను ఎదుర్కోనుంది. ఇప్పటికే కరోనా పుణ్యమా ఆ జట్టు ప్రాక్టీస్కు దూరమైంది. కీలక బౌలర్ దీపక్ చాహర్తో పాటు యువ ఆటగాడు రుతు రాజ్ మహమ్మారి బారిన పడ్డారు. క్వారంటైన్ పిరీయడ్ కూడా పెరిగింది. ఇక ప్రస్తుతం క్వారంటైన్లో ఉన్న ఆటగాళ్లు కూడా తీవ్ర భయాందోళనలో ఉన్నట్లు తెలుస్తుంది. ముఖ్యంగా ఫారిన్ ప్లేయర్స్ తీవ్ర ఆందోళనకు గురువుతున్నట్లు సమాచారం. అయితే శ్రీనివాసన్ మాత్రం పరిస్థితి అంత మాములుగానే ఉందని ధోనీ భరోసా ఇచ్చాడని చెప్పుకొచ్చాడు. ఎలాంటి పరిస్థితిని అయినా సీఎస్కే ఎదుర్కొంటుందన్నాడు. ఇక రైనా జట్టును వీడటంపై కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. విజయం తలకెక్కిందని ఘాటు వ్యాఖ్యలు చేశాడు.