ఐపీఎల్ మాజీ ఛైర్మెన్ లలిత్ మోదీపై భారత మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. 18 ఏళ్ల క్రితం జరిగిన ఘటనను మళ్లీ ఎందుకు గుర్తు చేస్తున్నారని ప్రశ్నించాడు. దీని వెనుక స్వార్థపూరిత ఉద్దేశం ఉండవచ్చని అభిప్రాయపడ్డాడు. ఐపీఎల్ అరంగేట్ర సీజన్(2008)లో మాజీ పేసర్ శ్రీశాంత్, హర్భజన్ సింగ్ మధ్య చోటు చేసుకున్న చెంపదెబ్బ ఘటనకు సంబంధించిన వీడియోను లలిత్ మోదీ తాజాగా విడుదల చేశాడు.
ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ మైఖేల్ క్లార్క్ పాడ్ కాస్ట్లో పాల్గొన్న లలిత్ మోదీ.. 18 ఏళ్ల సీక్రెట్గా ఉన్న వీడియోను బయటపెట్టాడు. ఐపీఎల్ టోర్నీ భవిష్యత్తు నేపథ్యంలో ఈ వీడియోను బయటకు రాకుండా చేయాలని అప్పట్లో నిర్ణయించారు. కానీ లలిత్ మోదీ తాజాగా వెలుగులోకి తేవడంతో ఈ వీడియో వైరల్గా మారింది. శ్రీశాంత్ చెంపపై హర్భజన్ సింగ్ కొట్టడం ఈ వీడియోలో స్పష్టంగా కనిపించింది.

తాజాగా ఈ వీడియోపై స్పందించిన హర్భజన్ సింగ్.. మరిచిపోయిన ఘటనను మళ్లీ గుర్తు చేయాల్సిన అవసరం ఏం ఉందని ప్రశ్నించాడు. 'ఈ వీడియో లీకైన విధానం తప్పు. ఇలా చేయాల్సింది కాదు. దీని వెనుక వారి స్వార్థపూరిత ఉద్దేశం ఉంది. 18 ఏళ్ల క్రితం జరిగిన ఆ ఘటనను అంతా మర్చిపోయారు. కానీ మళ్ళీ గుర్తు చేసే ప్రయత్నం చేశారు.
ఆ ఘటన గురించి తలుచుకుంటే నాకు బాధగా ఉంటుంది. ఆటగాళ్లు భావోద్వేగాలకు గురవ్వడం సహజం. కొన్నిసార్లు పొరపాట్లు జరుగుతుంటాయి. అయితే ఆ రోజు నేను అలా ప్రవర్తించాల్సింది కాదు. ఇప్పటికీ ఆ ఘటన పట్ల నేను సిగ్గుపడుతున్నాను. నేను ఘోర తప్పిదం చేశాను. మనుషులన్నప్పుడు తప్పులు చేయడం సహజం. అందులో నేను ఒకటి చేశాను. ఇలాంటి పోరపాట్లు మళ్లీ చేయకుండా చూసుకోవాలని ఆ గణేశుడిని కోరుకున్నాను.'అని హర్భజన్ సింగ్ ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు.