రాజస్థాన్ రాయల్స్ బ్యాటర్లపై టీమిండియా మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. కనీస ఇంగిత జ్ఞానం లేకుండా రాజస్థాన్ బ్యాటర్లు వ్యవహరించారని మండిపడ్డాడు. ఐపీఎల్ 2025 సీజన్లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్తో బుధవారం జరిగిన మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ ఓటమిపాలైంది. సూపర్ ఓవర్కు దారి తీసిన ఈ మ్యాచ్ను రాజస్థాన్ రాయల్స్ చేజేతులా చేజార్చుకుంది.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 188 పరుగులు చేసింది. అనంతరం రాజస్థాన్ రాయల్స్ కూడా నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 188 పరుగులే చేయడంతో సూపర్ ఓవర్ ఆడించాల్సి వచ్చింది. సూపర్ ఓవర్లో రాజస్థాన్ రాయల్స్ 11 పరుగులే చేసి ఆలౌటవ్వగా(రెండు వికెట్లు కోల్పోయి).. ఢిల్లీ క్యాపిటల్స్ మరో రెండు బంతులు మిగిలి ఉండగానే 13 పరుగులు చేసి గెలుపొందింది.

మిచెట్ స్టార్క్ సంచలన బౌలింగ్తో రాజస్థాన్ రాయల్స్ పతనాన్ని శాసించాడు. సూపర్ ఓవర్లో రాజస్థాన్ రాయల్స్ తరఫున రియాన్ పరాగ్, షిమ్రాన్ హెట్మైర్ బ్యాటింగ్ చేశారు. ఈ ఓవర్ నాలుగో బంతిని స్టార్క్ నోబాల్ వేయగా.. రియాన్ పరాగ్ బౌండరీ బాదాడు. అయితే ఆ మరుసటి బంతికే అతను రనౌటయ్యాడు. అతను సింగిల్ తీయకుండా బంతినే చూస్తూ ఉండిపోయాడు. ఆ తర్వాత క్రీజులోకి యశస్వి జైస్వాల్ రాగా.. ఐదో బంతిని హెట్మైర్ డీప్ మిడ్వికెట్ దిశగా ఆడి క్విక్ డబుల్ తీసే ప్రయత్నం చేశాడు. కానీ యశస్వి జైస్వాల్ రనౌటయ్యాడు. దాంతో ఆఖరి బంతి ఆడకుండానే రాజస్థాన్ సూపర్ ఓవర్ ముగిసింది. సూపర్ ఓవర్ రూల్స్ ప్రకారం ఇద్దరు బ్యాటర్లు ఔటైతే ఆలౌటైనట్లు లెక్క.
సూపర్ ఓవర్లో రాజస్థాన్ బ్యాటర్లు ఇంగిత జ్ఞానం లేకుండా ఆడారని హర్భజన్ సింగ్ విమర్శించాడు. యశస్వి జైస్వాల్.. పరుగుల చిరుతా అన్నట్లు రెండో రన్ కోసం పరుగెత్తాడని, పరాగ్ సింగిల్ తీయకుండా బంతినే చూస్తూ నిలబడ్డాడని విమర్శించాడు. '6 బంతులు ఆడకుండా ఏం చేశారు. రియాన్ పరాగ్.. సింగిల్ తీయకుండా బంతినే చూస్తూ నిలబడిపోయాడు. జైస్వాల్ పరుగుల చిరుతా అన్నట్లు ఫీలై పరుగెత్తి రనౌటయ్యాడు. జైస్వాల్.. నువ్వేం ఉసేన్ బోల్ట్ కాదు. సూపర్ ఓవర్లో రాజస్థాన్ బ్యాటర్లు ఇద్దరు ఔటయ్యారు. రాజస్థాన్ జట్టులో చాలా మంది కుర్రాళ్లు ఉన్నారు. రాజస్థాన్ గొప్ప జట్టుగా మారేందుకు కాస్త సమయం పడుతోంది. జట్టులో ఉన్న సీనియర్ ఆటగాళ్లంతా కుర్రళ్లాను గైడ్ చేయాలి.'అని హర్భజన్ సింగ్ చెప్పుకొచ్చాడు.