సెలబ్రెటీల కరోనా పోస్ట్లు..
సెలబ్రెటీలు కూడా తమవంతు బాధ్యతగా ఈ వైరస్ రాకుండా ఉండేందుకు సోషల్ మీడియా వేదికగా సూచనలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో టీమిండియా వెటరన్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ కూడా కరోనా కట్టడికి పాటించాల్సిన నియమాలను తెలియజేస్తూ ప్రజలకు అవగాహన కల్పించే ప్రయత్నం చేశాడు. అయితే క్రికెట్ భాషలో అతను చేసిన ప్రయత్నం బెడిసి కొట్టినట్లు తెలుస్తోంది.
ధోనీలా నిర్లక్ష్యం వద్దు..
2019 ఐపీఎల్ సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ మధ్య మ్యాచ్ జరగగా.. ఆ మ్యాచ్లో చెన్నై గెలుపొందింది. దీంతో.. మ్యాచ్ అనంతరం చెన్నై సూపర్ కింగ్స్ టీమ్ మైదానం వీడుతుండగా.. వారికి ఎదురొచ్చిన పంజాబ్ ఫ్రాంఛైజీ సహ యజమాని ప్రీతిజింటా.. ధోనీకి షేక్హ్యాండ్ ఇచ్చింది. ఆ తర్వాత ధోనీ వెంట ఉన్న హర్భజన్ సింగ్కి కూడా ప్రీతిజింటా షేక్హ్యాండ్ ఇవ్వగా.. భజ్జీ మాత్రం నమస్కారంతో సరిపెట్టాడు. ఇప్పుడు ఈ రెండు ఫొటోల్ని హర్భజన్ సింగ్ షేర్ చేస్తూ ‘‘కరోనా వైరస్ కట్టడికి ఒక్క అడుగు''చాలు అని రాసుకొచ్చాడు. అయితే ధోనీలా కాకుండా తనను ఫాలో అవ్వాలనే అర్థం వచ్చేలా ఈ ఫొటోలు ఉండటంతో మహీ ఫ్యాన్స్ హర్ట్ అయ్యారు.
ధోనీనే కించపరుస్తావా?
కరోనాపై అవగాహన కల్పించేందుకు ధోనీని కించపరిచేలా పోలిక తెస్తావా? అంటూ మహీ అభిమానులు మండిపడుతున్నారు.
ఐపీఎల్లో సుదీర్ఘకాలం ముంబై ఇండియన్స్కు ఆడిన హర్భజన్ సింగ్.. 2018 నుంచి చెన్నై సూపర్ కింగ్స్కు ఆడుతున్న విషయం తెలిసిందే. రెండేళ్ల క్రితం వరకూ భారత జట్టులో చోటు కోల్పోవడానికి ధోనీనే కారణమని పరోక్ష వ్యాఖ్యలు చేసిన భజ్జీ.. చెన్నై జట్టులోకి వచ్చిన తర్వాత మాట మార్చి ధోనీ బెస్ట్ కెప్టెన్ అని కితాబు ఇస్తున్నాడు. ఈ విషయాన్ని కూడా ఫ్యాన్స్ ప్రస్తావిస్తూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
కరోనాను పట్టించుకోని ధోనీ..
ఇదిలా ఉంటే ధోనీ మాత్రం కరోనాను పెద్దగా సీరియస్ తీసుకున్నట్లు అనిపించడంలేదు. కేంద్ర ప్రభుత్వం, బీసీసీఐ విడుదుల చేసిన మార్గదర్శకాలను కూడా అతను పట్టించుకోవడం లేదు. కరోనా నేపథ్యంలో ఐపీఎల్ ఏప్రిల్ 15కు వాయిదాపడటంతో చెన్నై సూపర్ కింగ్స్ ప్రాక్టీస్ రద్దు చేసింది. దీంతో రాంచీకి వెళ్లిన ధోనీ ఏంచక్కా బ్యాడ్మింటన్ ఆడుతూ.. బైక్పై షికారుకు వెళ్తూ తెగ ఎంజాయ్ చేస్తున్నారు. మరోవైపు ఎవరీకి షేక్ హ్యాండ్ ఇవ్వద్దని యావత్ ప్రపంచం మొత్తుకుంటున్నా ధోనీ మాత్రం.. తన ఫ్యాన్స్కు షేక్ హ్యాండ్ ఇస్తూనే ఉన్నాడు. ఇటీవల చెన్నైలోని చెపాక్ స్టేడియంలో చివరి ప్రాక్టీస్ సెషన్ తర్వాత అక్కడి అభిమానులతో సరదాగా షేక్హ్యాండ్స్ ఇస్తూ ధోనీ కనిపించాడు.