టీమిండియా మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ సోషల్ మీడియా వేదికగా వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. 'ఈ రోజుల్లో కొన్ని చీమలు తేనెటీగలకే తేనే గురించి పాఠాలు చెబుతున్నాయి.'అని సెటైరికల్గా ట్వీట్ చేశాడు. అయితే ఎవరిని ఉద్దేశించి ఈ పోస్ట్ చేశాడనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం భజ్జీ చేసిన ట్వీట్ నెట్టింట వైరల్గా మారింది.
మంగళవారం(అక్టోబర్ 8) హరియాణా, జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. జమ్మూకశ్మీర్లో కాంగ్రెస్ కూటమి విజయం సాధించగా.. హరియాణా ఎన్నికల్లో బీజేపీ గెలిచింది. ఈ ఫలితాలు వెలువడిన రోజునే హర్భజన్ సింగ్ సెటైరికల్గా ట్వీట్ చేయడంతో తీవ్ర చర్చనీయాంశమైంది.

హరియాణా ఎన్నికల్లో భంగపడిన కాంగ్రెస్ పార్టీ ఉద్దేశించి ఈ పోస్ట్ పెట్టాడా? లేక క్రికెట్కు సంబంధించిన పోస్టా? అని నెటిజన్లు చర్చించుకుంటున్నారు. హర్భజన్ సింగ్ ఎవరిపైనో బాగా కోపంగా ఉన్నాడని, ఎవరో అతన్ని తెగ ఇబ్బంది పెట్టినట్లున్నారని కామెంట్ చేశారు.
ఇక హరియాణాలో కాంగ్రెస్ గెలుస్తుందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేసాయి. కానీ ఫలితం మాత్రం బీజేపీకి అనుకూలంగా వచ్చింది. మొత్తం 90 స్థానాలకు జరిగిన హరియాణా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 48 సీట్లతో అధికారాన్ని నిలబెట్టుకుంది. వరుసగా మూడో సారి గెలుపొంది హ్యాట్రిక్ సాధించింది. మరోవైపు క్లీన్ స్వీప్ చేస్తుందనుకున్న కాంగ్రెస్ 37 స్థానాలకే పరిమితమైంది.
కాంగ్రెస్ అతివిశ్వాసాన్ని ఉద్దేశించే హర్భజన్ సింగ్ ఈ ట్వీట్ చేసి ఉంటాడని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. హర్భజన్ సింగ్ను ఆమ్ఆద్మీ పార్టీ రాజ్యసభ సభ్యుడిగా నామినేట్ చేసిన విషయం తెలిసిందే. ఇక హరియాణా ఎన్నికల్లో ఆప్ ఖాతా తెరువలేకపోయింది.
Nowadays, some ants are teaching bees
— Harbhajan Turbanator (@harbhajan_singh) October 8, 2024
how to make honey 🎯
ఇటీవల హర్భజన్ సింగ్.. ధోనీ గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. ఐపీఎల్ 2024 సీజన్లో ఆర్సీబీతో జరిగిన ఆఖరి లీగ్ మ్యాచ్లో సీఎస్కే ఓటమిని తట్టుకోలేక ధోనీ టీవీ పగలగొట్టాడని తెలిపాడు. అయితే ఈ వ్యాఖ్యలను సీఎస్కే ఫిజియోథెరపిస్ట్ ఖండించాడు. అలాంటి ఘటన ఏం జరగలేదని స్పష్టం చేశాడు. దాంతో ఈ వ్యవహారం కాస్త హాట్ టాపిక్ మారింది. దీన్ని ఉద్దేశించి హర్భజన్ సెటైరికల్ పోస్ట్ చేశాడా? అనే సందేహం కూడా వ్యక్తమవుతోంది.