టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీపై మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ ప్రశంసల జల్లు కురిపించాడు. ఐసీసీ టైటిల్ గెలవకున్నా విరాట్ కోహ్లీ గొప్ప కెప్టెన్ అని కొనియాడాడు. కెప్టెన్గా జట్టులో అనేక మార్పులు తీసుకొచ్చాడని గుర్తు చేశాడు. ముఖ్యంగా టెస్ట్ల్లో టీమిండియాను నడిపించిన విధానం అద్భుతమని ప్రశంసించాడు.
విదేశీ గడ్డపై కూడా టీమిండియా విజయాలు సాధిస్తుందంటే.. దానికి కారణం విరాట్ కోహ్లీ కెప్టెన్సీనే అని అభిప్రాయపడ్డాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో విరాట్ కోహ్లీ సారథ్యం గురించి మాట్లాడిన హర్భజన్ సింగ్.. ఐసీసీ ట్రోఫీ గెలవనంత మాత్రాన కోహ్లీ గొప్ప నాయకుడు కాకుండా పోడని అభిప్రాయపడ్డాడు.

ఐసీసీ టైటిల్ గెలవకున్నా..
'విరాట్ కోహ్లీ సారథ్యంలో టీమిండియా ఒక్క ఐసీసీ ట్రోఫీ కూడా గెలవలేదు. అంత మాత్రానా అతను గొప్ప నాయకుడు కాకుండా పోడు. సారథిగా కోహ్లీ ప్రపంచకప్లు గెలవకపోయినా.. జట్టులో విజయం సాధించాలనే కాంక్షను పుట్టించాడు. రెండో ఇన్నింగ్స్లో 400 పరుగుల లక్ష్యం చేధించడమంటే మాములు విషయం కాదు.
కెప్టెన్గా జట్టులోని ప్రతీ ఆటగాడికి ఫియర్లెస్ గేమ్ నేర్పించాడు. చివరి వరకు పోరాడాలనే తెగువ తీసుకొచ్చాడు. గబ్బా టెస్ట్లో శుభ్మన్ గిల్, రిషభ్ పంత్ ఆడిన తీరు ఎప్పటికీ మరవలేం. అప్పట్నుంచే భారత జట్టు ఆలోచనా విధానం పూర్తిగా మారిపోయింది. విదేశాల్లోనూ టీమిండియాను చూస్తే ప్రత్యర్థి జట్లు భయపడుతున్నాయి. ఇందుకు ప్రధాన కారణం విరాట్ కోహ్లీ.'అని హర్భజన్ సింగ్ చెప్పుకొచ్చాడు.
ఫైనల్లో చెలరేగే ఆటగాడు..
ఆటగాడిగా కూడా కోహ్లీ గొప్ప బ్యాట్స్మన్ అని హర్భజన్ సింగ్ కొనియాడాడు. 'విరాట్ కోహ్లీ గొప్ప ఆటగాడు. మెగా టోర్నీలు, కీలక ఫైనల్లో ఎప్పుడూ అత్యుత్తమ ప్రదర్శన కనబరుస్తాడు. గత టీ20 ప్రపంచకప్ ఫైనల్లోనూ కీలక ఇన్నింగ్స్ ఆడాడు. టీ20 ఫార్మాట్లో పరుగులు ఎలా చేయాలో కోహ్లీకి బాగా తెలుసు. 'అని భజ్జీ చెప్పుకొచ్చాడు.
విరాట్ కోహ్లీ సారథ్యంలోనే టీమిండియా తొలిసారి ఆసీస్ గడ్డపై టెస్ట్ సిరీస్ గెలిచింది. 2018-19 బోర్డర్ గవాస్కర్ను సొంతం చేసుకుంది. ఆ తర్వాత 2021-22 బోర్డర్ గవాస్కర్ను గెలుచుకుంది. ఈ సిరీస్లో తొలి మ్యాచ్ అనంతరం విరాట్ కోహ్లీ వ్యక్తిగత పనులతో స్వదేశం తిరిగి రాగా.. అజింక్యా రహానే జట్టును నడిపించాడు.
ఈ ఏడాది నవంబర్లో భారత్ మరోసారి ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లనుంది. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2024లో భాగంగా ఈసారి ఐదు టెస్ట్లు జరగనున్నాయి. సుమారు 30 ఏళ్ల తర్వాత ఐదు టెస్ట్ల సిరీస్ నిర్వహిస్తున్నారు.