
న్యూఢిల్లీ: ఆస్ట్రేలియా పర్యటనలో దారుణంగా విఫలమైన టీమిండియా యువ బ్యాట్స్మన్ సంజూ శాంసన్ అత్యంత వేగంగా తన తప్పిదాలను సరిదిద్దుకోవాలని భారత వెటరన్ హర్భజన్ సింగ్ సూచించాడు. లేకుంటే మరొకరు జట్టులోకి వస్తారని హెచ్చరించాడు. ఆస్ట్రేలియాతో తాజాగా ముగిసిన మూడు టీ20ల సిరీస్లో సంజు శాంసన్కు టీమిండియా వరుసగా అవకాశాలిచ్చింది. కానీ ఈ కేరళ బ్యాట్స్మెన్ బంగారంలాంటి అవకాశాలను వృథా చేశాడు. మూడింటికి మూడు మ్యాచ్ల్లోనూ విఫలమయ్యాడు. నెం.4లో ఆడిన సంజు శాంసన్ వరుసగా 23, 15, 10 పరుగులు మాత్రమే చేశాడు. అయితే.. సిరీస్లో అతని స్ట్రైక్రేట్ 141గా ఉండటం ఒక్కటే సానుకూలంశం. అతని వైఫల్యంపై తాజాగా స్పందించిన హర్భజన్.. తప్పిదాలను సవరించుకుంటాడని ఆశాభావం వ్యక్తం చేశాడు.
'సంజు శాంసన్కు నాలుగో స్థానంలో వరుసగా మూడు మ్యాచ్ల్లోనూ ఆడే అవకాశం లభించింది. కానీ అతను విఫలమయ్యాడు. బహుశా శాంసన్కు ఇది మొదటిది లేదా రెండో విదేశీ పర్యటన అనుకుంటా.! శాంసన్ అపార నైపుణ్యం కలిగిన ఆటగాడు. అతనిలాంటి క్రికెటర్లే టీమిండియా భవిష్యత్తు ఆశాకిరణాలు. తప్పిదాలు చేయందే ఎవరూ ఏమీ నేర్చుకోలేరు. సంజు శాంసన్ కచ్చితంగా తన తప్పిదాల్ని దిద్దుకుంటాడు. ఒకవేళ దిద్దుకోలేకపోతే.. అతని స్థానంలో మరో క్రికెటర్ వస్తాడు'' అని హర్భజన్ సింగ్ చెప్పుకొచ్చాడు.
2015లో భారత టీ20 జట్టులో తొలిసారి చోటు దక్కిచ్చుకున్న సంజూ శాంసన్.. ఆ వెంటనే చోటు కోల్పోయాడు. మళ్లీ ఐదేళ్ల తర్వాత ఈ ఏడాది ఆరంభంలో అవకాశాన్ని అందుకున్నాడు. ఈ ఏడాది ఆరు మ్యాచ్ల్లో ఆడి కనీసం ఒక్క మ్యాచ్లో కూడా రాణించలేకపోయాడు. కేఎల్ రాహుల్ వికెట్ కీపింగ్ చేస్తుండటంతో.. కేవలం బ్యాట్స్మన్గా మాత్రమే సంజూ శాంసన్ను టీమ్లోకి సెలెక్టర్లు ఎంపిక చేస్తున్నారు.