టీమిండియా దిగ్గజ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ కంటే రోహిత్ శర్మ అత్యుత్తమ సారథని మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ అన్నాడు. రోహిత్ శర్మ ఆటగాళ్లతో సన్నిహితంగా ఉంటాడని, ధోనీ మాత్రం అలా కాదని తెలిపాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న హర్భజన్ సింగ్.. రోహిత్, ధోనీ కెప్టెన్సీ మధ్య ఉన్న తేడాను వివరించాడు.
'ధోనీ కంటే రోహిత్ శర్మ కెప్టెన్సీనే నాకిష్టం. ఎందుకంటే రోహిత్ శర్మ ఆటగాళ్లకు ప్రాధాన్యత ఇస్తాడు. వారి దగ్గరకు వెళ్లి మాట్లాడుతాడు. వారికేం కావాలో అడుగుతాడు. అందుకే ఆటగాళ్లంతా రోహిత్ శర్మతో సన్నిహితంగా ఉంటారు. కానీ ధోనీ అలా కాదు. అతని కెప్టెన్సీ శైలి భిన్నంగా ఉంటుంది. ఎవరితోనూ ఏ మాట్లాడడు. బౌలర్ దగ్గరకు వెళ్లి కనీసం ఎలాంటి ఫీల్డ్ కావాలని కూడా అడగడు. తప్పుల నుంచి పాఠాలు నేర్చుకోవాలని భావిస్తాడు.'అని హర్భజన్ సింగ్ చెప్పుకొచ్చాడు.

టీమిండియా స్టార్ విరాట్ కోహ్లీ గొప్ప ఆటగాడని హర్భజన్ సింగ్ ప్రశంసించాడు. మెగా టోర్నీల్లో అత్యుత్తమ ప్రదర్శన కనబరుస్తారని కొనియాడాడు. 'విరాట్ కోహ్లీ గొప్ప ఆటగాడు. మెగా టోర్నీలు, కీలక ఫైనల్లో ఎప్పుడూ అత్యుత్తమ ప్రదర్శన కనబరుస్తాడు. గత టీ20 ప్రపంచకప్ ఫైనల్లోనూ కీలక ఇన్నింగ్స్ ఆడాడు. టీ20 ఫార్మాట్లో పరుగులు ఎలా చేయాలో కోహ్లీకి బాగా తెలుసు. 'అని భజ్జీ చెప్పుకొచ్చాడు.
ఐపీఎల్ 2024 సీజన్లో ఆర్సీబీతో జరిగిన ఆఖరి లీగ్ మ్యాచ్లో సీఎస్కే ఓటమిపాలవ్వడంతో ధోనీ తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడని, డ్రెస్సింగ్ రూమ్కు సమీపంగా ఉన్న టీవీని పగలగొట్టాడని కూడా హర్భజన్ సింగ్ తెలిపాడు. 'సంచలన విజయంతో ఆర్సీబీ సంబరాలు చేసుకుంది. ఈ మ్యాచ్కు నేను కామెంటేటర్గా వ్యవహరించాను.మ్యాచ్ అనంతరం ఆర్సీబీ సంబరాలను పై నుంచి చూశాను.
ఓవైపు బెంగళూరు ఆటగాళ్లు సంబరాలు చేసుకుంటుండగా.. మరోవైపు సీఎస్కే ఆటగాళ్లు వారికి కరాచలనం ఇచ్చేందుకు సిద్దమయ్యారు. కానీ, ఆర్సీబీ ఆటగాళ్లు వారిని పట్టించుకోలేదు. దాంతో అసహనానికి గురైన ధోనీ.. అక్కడి నుంచి డ్రెస్సింగ్ రూమ్లోకి వెళ్లాడు. అలా వెళ్లే క్రమంలో బయట ఉన్న ఓ స్క్రీన్ను చేతిలో బలంగా బాదాడు.
ప్రతీ ఆటగాడికి భావోద్వేగాలు ఉంటాయి. క్రీడల్లో ఇలాంటి ఘటనలు సహజం.'అని హర్భజన్ సింగ్ చెప్పుకొచ్చాడు. ఈ వ్యాఖ్యలను సీఎస్కే ఫిజియోథెరపిస్ట్ టామ్మీ సిమ్సెక్ ఖండించాడు. ఫేక్ న్యూస్ అని ఇన్స్టాగ్రామ్లో పేర్కొన్నాడు.