టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీకి టీ20 ప్రపంచకప్ 2024 జట్టులో చోటు దక్కదనే వాదన తీవ్ర చర్చనీయాంశమైంది. టీమిండియా మేనేజ్మెంట్ ప్రణాళికల్లో విరాట్ కోహ్లీ లేడని ఓ జాతీయ దినపత్రిక ప్రచురించిన కథనం దుమారం రేపింది.
టీ20 ప్రపంచకప్ 2024 జరిగే వెస్టిండీస్, అమెరికా పిచ్లు నెమ్మదిగా ఉంటాయని, ఆ స్లో వికెట్స్ కోహ్లీ బ్యాటింగ్కు సరిపోవని భావించి అతన్ని దూరంగా ఉంచాలని అజిత్ అగార్కర్ సారథ్యంలోని సెలెక్షన్ కమిటీ నిర్ణయించిందని సదరు పత్రిక తమ కథనంలో పేర్కొంది. అంతేకాకుండా టీ20ల్లో అతని పేలవ ఫామ్ కూడా పరిగణలోకి తీసుకున్నట్లు ప్రస్తావించింది.

అయితే ఈ కథనంపై మాజీ క్రికెటర్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ తరం అత్యుత్తమ క్రికెటర్ అయిన విరాట్ కోహ్లీకి చోటు దక్కకపోవడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఈ క్రమంలోనే భారత మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ సైతం ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
విరాట్ కోహ్లీ ఎన్నో రికార్డులు సాధించినా.. మరో ఐసీసీ టైటిల్ సాధించలేదనే విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నానని తెలిపాడు. రికార్డులను జనాలు గుర్తుపెట్టుకోలేరని, ఏ ఆటగాడికైనా టైటిళ్లు గెలవడమే ముఖ్యమని చెప్పాడు.
'టీ20 ప్రపంచకప్ ముందు ఐపీఎల్ జరగనుంది. విరాట్ కోహ్లీ బ్యాట్ మరోసారి పరుగుల మోత మోగించనుంది. క్రికెటర్గా విరాట్ కోహ్లీకి తీరని కోరిక ఉంది. అది ప్రపంచకప్ ట్రోఫీ గెలవడం. అతను చివరిసారిగా గెలిచిన ప్రపంచకప్ విరాట్ కోహ్లీగా పేరు తెచ్చుకున్నప్పటిది కాదు. చీకూగా యువ ప్లేయర్గా సాధించినది.
తొలి ప్రయత్నంలోనే అతనికి ప్రపంచకప్ దక్కింది. ఆ తర్వాత అతను ఓ బిగ్ ప్లేయర్గా ఎదిగాడు. కానీ ప్రపంచకప్ గెలవలేదు. 2015, 2019, 2023 వన్డే ప్రపంచకప్లు ఆడినా నిరాశే ఎదురైంది. ఈ విషయంలో అతను ఇప్పటికీ బాధపడుతూనే ఉన్నాడు.
కోహ్లీలాంటి వరల్డ్ బెస్ట్ ప్లేయర్ ప్రపంచకప్ గెలవలేదంటే జీర్ణించుకోవడానికి కష్టంగా ఉంది. ప్రపంచకప్ గెలవకుండా అతను ఎన్ని రికార్డులు సాధించినా.. ఎన్ని పరుగులు చేసినా వృథానే. ప్రపంచకప్ గెలవాలంటే అతని కసి ఏ మాత్రం తగ్గదు. ప్రతీ ప్లేయర్కు ప్రపంచకప్ గెలవడం ఓ కల. ఆటగాళ్ల రికార్డులు వారితోనే ఉంటాయి. కానీ జనాలకు గుర్తుండవు. వారికి టైటిళ్లు మాత్రమే గుర్తుంటాయి.'అని హర్భజన్ సింగ్ చెప్పుకొచ్చాడు.